కట్టుకున్న వాడిపైనే భార్య కత్తి దూసింది.. కారణం చిన్నదిగానే కనిపిస్తున్నా దాని వెనక అభిప్రాయ భేదాలు, అపార్థాలు కూడా పెద్ద పెద్ద ఘర్షణలకు, చివరికి ఇలాంటి విషాదాలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్( 26) ఏసీ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం పెళ్లికి దారితీసింది. అయితే, ఆమెకు గతంలోనే వివాహం జరిగిందని, మొదటి భర్త జైలులో ఉన్నాడన్న సమాచారం.
సంఘటన జరిగిన గురువారం, రంజాన్ ఉపవాసం ఉన్న అహ్మద్ మధ్యాహ్నం ఇంటికి అలసిపోయి వచ్చాడు. ఆ సమయంలో భార్య క్రాంతి పెద్ద శబ్దంతో టీవీ చూస్తోంది. అలసిపోయిన అహ్మద్ టీవీ సౌండ్ తగ్గించమని కోరడం, అది కాస్తా తీవ్రమైన వాగ్వాదానికి, ఆపై ఘర్షణకు దారి తీసింది.
క్షణికావేశంలో క్రాంతి ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని భర్తపై దాడి చేయడంతో అహ్మద్ కు గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇక్కడ కేవలం టీవీ సౌండ్ గొడవ వల్లే అనే వార్త నిజానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. గత కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు రావడం ఈ దారుణానికి కరణం అయ్యిందని తెలుస్తుంది.
ఇటీవలి కాలంలో దంపతుల మధ్య తలెత్తే చిన్నచిన్న విభేదాలు పెద్ద విషాదాలకు దారితీస్తున్నాయి. ఓపిక లేకపోవడం, సంభాషణ లోపించడం, భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం వంటి అంశాలు కుటుంబాల్లో అస్థిరతను పెంచుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం మిగిలే గాయాలను మిగులుస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
పరస్పర నమ్మకం, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకునే ఓర్పు ఈ బంధానికి పునాదులు. కానీ, ఇప్పుడు ఈ బంధాలు చాలా సున్నితంగా మారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, పర్యవసానాలను ఆలోచించకుండా చేసే పనులు, జీవితాంతం తీరని గాయాలను, పశ్చాత్తాపాలను మిగులుస్తాయి. ఈ దుర్ఘటన షేక్ అహ్మద్ జీవితాన్నే ముగించగా, క్రాంతి భవిష్యత్తును కూడా చీకటిలోకి నెట్టేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates