శవమై తేలిన మనపల్లి అత్యాచార నిందితుడు

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కులవర్ధన్ మృతి ఎలా జరిగిందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసు నేపధ్యంలోకి వెళితే.. మదనపల్లె శివార్లలో సోమవారం సాయంత్రం ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక మృతదేహం మరుసటి రోజు ఉదయం నిందితుడి ఇంటి సమీపంలోని నీళ్ల డ్రమ్ములో లభించింది..బాలికపై అత్యాచారం జరిగిందని, అనంతరం నిందితుడు నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేశాడని పోలీసులు ధృవీకరించారు. ఈ ఘోరం వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న కులవర్ధన్, ఈ రోజు సమీపంలోని చెరువులో శవమై తేలాడు.

మరోవైపు అత్యాచారం, హత్యకు గురైన ఏడేళ్ల బాలిక మృతదేహానికి ఆమె స్వగ్రామమైన రాగిమానుదిన్నెపల్లెలో ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.