పాకిస్థాన్ ఏం సాధించినట్లు?

మొత్తానికి సస్పెన్సుకు తెరపడింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ యథావిధిగా జరగబోతోంది. ఆదివారం కొలంబోలో రెండు జట్లు తలపడబోతున్నాయి. బంగ్లాదేశ్ జట్టును ప్రపంచకప్ నుంచి తప్పించినందుకు నిరసనగా తాము ఇండియాతో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్థాన్ ప్రకటించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

మొదట్లో ఆ దేశం బెట్టు చూస్తే ఈసారి నిజంగానే చిరకాల ప్రత్యర్థుల పోరు ఉండదనే అనిపించింది. కానీ గత కొన్ని రోజుల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నిన్న రాత్రి తాము ఈ మ్యాచ్‌కు రెడీ అంటూ పాకిస్థాన్ ప్రకటించడంతో కథ సుఖాంతమైంది.

కానీ పాకిస్థాన్ ఇలా యుటర్న్ తీసుకుంటుందని సునీల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ సహా ఎంతోమంది భారత మాజీ క్రికెటర్లు ముందు నుంచి చెబుతూనే వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రెడిక్షన్ చాలామంది చేశారు.
తాము ఇండియా మ్యాచ్ ఆడము అంటే ప్రపంచ క్రికెట్ షేకైపోతుందని.. ఇటు ఐసీసీ, అటు బీసీసీఐ తమ దగ్గర కాళ్ల బేరానికి వస్తాయని అనుకుంది పాకిస్థాన్. కానీ అలాంటిదేమీ జరగలేదు.

బీసీసీఐ అసలు ఈ విషయాన్ని పట్టించుకోనట్లే ఉండిపోయింది. ఈ మ్యాచ్ ఆడకపోతే జరిగే నష్టం గురించి హెచ్చరించిన ఐసీసీ.. పీసీబీని భయపెట్టింది. ఈ మ్యాచ్ ఆడమని కోరింది తప్పితే.. బతిమాలుకోవడం లాంటిదేమీ చేయలేదు. ఐతే ముందు ఆడమని, చెప్పి తర్వాత తమకు తాముగా యుటర్న్ తీసుకుంటే పరువు పోతుంది కాబట్టి.. శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ బోర్డులు విన్నవించడంతో నిర్ణయం మార్చుకున్నట్లుగా ఇప్పుడు పాక్ కలరింగ్ ఇస్తోంది.

ఆయా బోర్డులతో సంప్రదింపులు జరిపి వాళ్లు తమను ఈ మ్యాచ్ ఆడాలని అడిగేలా చేసుకుందన్నది క్రికెట్ వర్గాల మాట. అసలు ఈ మ్యాచ్ ఆడాలని అడగాల్సింది బీసీసీఐ. కానీ భారత బోర్డు ఆ పని చేయలేదు. ఐసీసీ కూడా ఆ దేశాన్ని బతిమాలుకోవడం లాంటిదేమీ చేయలేదు.

ఈ మ్యాచ్ తాము ఆడాలంటే భారత్ తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని.. తమతో, బంగ్లాతో కలిపి ఒక ముక్కోణపు సిరీస్‌కు ఓకే చెప్పాలని.. ఐసీసీ టోర్నీల కోసం తమ దేశానికి రావాలని.. ఇలా ఎన్నో కండిషన్లు పెట్టింది పాకిస్థాన్ బోర్డు. ఇందులో ఒక్కదానికి కూడా భారత్ ఒప్పుకోలేదు. ఐసీసీ కూడా హామీ ఇవ్వలేదు.

చివరికి బంగ్లాదేశ్ ప్రపంచకప్‌లో ఆడనందుకు పెనాల్టీ ఉండకూడదని, పార్టిసిపేషన్ ఫీజు ఇవ్వాలని.. అలాగే ఆ దేశానికి ఒక ఐసీసీ టోర్నీ ఇవ్వాలని అడిగితే.. వీటికి మాత్రం ఐసీసీ ఓకే చెప్పింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఏదైనా మేలు జరిగిందంటే అది బంగ్లాకే. పాకిస్థాన్ మాత్రం సాధించింది ఏమీ లేదు. పైగా మ్యాచ్ ఆడము అని చెప్పి, మళ్లీ యుటర్న్ తీసుకోవడం ద్వారా పరువు పోగొట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాకు మేలు చేకూర్చడం కోసం తన పరువుని పాకిస్థాన్ పణంగా పెట్టిందన్నమాట.