తాగేసి రూ.10కోట్ల కారుతో వ్యాపారి కొడుకు ఆరాచకం…

బలుపు చేష్టలు ఎంత భయానకంగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడో వ్యాపారి కొడుకు. ఫుల్ గా తాగేసి.. ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేయటమే కాదు.. అమాయకుల ప్రాణాల మీద ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరించిన తీరును చూస్తే నోట మాట రాదంతే.

ఉత్తరప్రదేశ్ లోని ఒక బడా వ్యాపారి కొడుకు ఫుల్ గా తాగేసి మద్యం మత్తులో రెచ్చిపోయాడు. రూ.10 కోట్ల విలువైన లంబోర్గిని కారుతో అతడు క్రియేట్ చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. అసలేం జరిగిందంటే..

యూపీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన కాన్పూరు నగరంలో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా. అతడి గారాలపట్టి శివం. ఇతగాడు ఆదివారం రాత్రి ఫుల్ గా తాగేసి మద్యం మత్తులో విలాసవంతమైన లంబోర్గిని కారును రాకెట్ స్పీడ్ తో రోడ్ల మీద పరుగులు తీయించాడు. ఈ కారణంగా పెను ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదకరంగా కారును నడిపి ఒక ఆటోను ఢీకొట్టిన ఉదంతంలో ఇతగాడు ప్రయాణిస్తున్న కారు ఏకంగా పది అడుగుల ఎత్తుకు గాల్లో ఎగిరి రోడ్డు మీద ఉన్న పాదచారులపైనా.. వాహనాలపైకి దూసుకెళ్లింది.
ఈ ఉదంతంలో ఏ పాపం తెలీని ఆరుగురు తీవ్ర గాయాల బారిన పడ్డారు.

ప్రమాదం జరిగినంతనే.. ఘటనా స్థలం నుంచి అతగాడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే.. స్థానికులు అతడ్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాద ఘటన గురించి తెలిసినంతనే మరో కారులో అక్కడకు చేరుకున్న వ్యాపారి కేకే మిశ్రా.. బౌన్సర్లతో  కలిసి వచ్చాడు.

స్థానికులపై ఆయన దౌర్జన్యానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైప్రొఫైల్ కేసు కావటంతో నిందితుడ్ని తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేకే మిశ్రా విషయానికి వస్తే ఆయనకు చెందిన బన్షిదర్ ఎక్స్ పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్ అనే పొగాకు కంపెనీ చాలా పెద్దది. గతంలో ఈ సంస్థపై ఐటీ దాడులు నిర్వహించి రూ.100 కోట్లకు పైనే పన్ను ఎగవేసినట్లుగా గుర్తించినట్లు చెబుతారు. మరి.. ఈ తరహా కేసుల విషయంలో యూపీ సీఎం యోగి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.