మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సతీమణి స్టాక్ మార్కెట్ మోసానికి గురైన విషయం తెలిసిందే. ఆన్లైన్లో సైబర్ నేరస్తుల బారిన పడిన ఆమె, వారి సూచనల మేరకు కోట్ల రూపాయల సొమ్మును పెట్టుబడిగా పెట్టారు. చివరకు అది మోసమని గ్రహించే సరికి దాదాపు 2 కోట్ల 58 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు.
చిత్రమేంటంటే, ఈ కేసులో నేరస్తులు పంపించిన వాట్సాప్ లింకు, అనంతరం ట్రేడింగ్ అంతా లక్ష్మీనారాయణ కనుసన్నల్లోనే సాగింది. ఆయన సతీమణికి అంత పరిజ్ఞానం లేకపోవడంతో ఆమె నేరస్తులకు లక్ష్మీనారాయణ వాట్సాప్ నెంబరే ఇచ్చారు.
దీంతో సైబర్ నేరస్తులు తమ లింకును లక్ష్మీనారాయణ ఫోన్కే పంపించారు. తదుపరి పెట్టుబడులు అన్నీ అదే ఫోన్ నెంబరు నుంచే జరిగాయి. మొత్తంగా 2.58 కోట్ల రూపాయల పెట్టుబడి మోసం జరిగిన తర్వాత విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ దంపతులు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో తాజాగా అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మయన్మార్ సహా పలు దేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ అరెస్టులు జరిగే సమయానికి కేవలం 45 లక్షలు మాత్రమే పోలీసులకు లభించాయి. దీంతో ఆ సొమ్మును ఫ్రీజ్ చేశారు.
వాస్తవానికి ఈ మోసం వ్యవహారం మొత్తం రెండు నెలల పాటు సాగింది. నవంబరులో లక్ష్మీనారాయణ సతీమణికి లింకు వచ్చింది. దాని తర్వాత ఆమె ట్రేడింగ్లో కొద్దికొద్దిగా సొమ్ము పెట్టారు. వెంటనే నేరస్తులు లాభాలు వచ్చినట్టు డబ్బు పంపించి ఆమెను నమ్మించారు. ఇంకా పెట్టుబడి పెడితే మరింత లాభం వస్తుందని చెప్పుకొచ్చారు.
ఇది నిజమేనని నమ్మిన ఆమె తన భర్తతో కూడా పెట్టుబడి పెట్టించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ కూడా ఇది నిజమేనని భావించారు. అంతేకాదు, తన వద్ద ఉన్న బంగారాన్ని కూడా కుదువ పెట్టి అప్పులు తెచ్చి మరీ ఇందులో పెట్టుబడి పెట్టారు.
ప్రస్తుతం నలుగురు నిందితులు మాత్రమే పట్టుబడ్డారని, దీని వెనుక చాలా పెద్ద ముఠా ఉందని పోలీసులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates