న్యూజిలాండ్తో జరుగుతున్న టి20 సిరీస్లో మరోసారి టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించింది. జనవరి 25న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టి20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. కేవలం 10 ఓవర్లలోనే 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది సూర్య సేన.
ఈ మ్యాచ్లో భారత బౌలర్లు మొదట అద్భుతమైన ప్రదర్శన చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ను 9 వికెట్ల నష్టానికి 153 పరుగులకే కట్టడి చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి కివీస్ వెన్నులో వణుకు పుట్టించాడు. హార్దిక్ పాండ్యా (2/23), రవి బిష్ణోయ్ (2/18) హర్షిత్ రాణా (1/35) వికెట్లు తీసి ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (48), మార్క్ చాప్మన్ (32) మాత్రమే కొంత ప్రతిఘటించారు.
ఛేదనలో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే సంజూ శామ్సన్ (0) అవుట్ అయినా, ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుట్ అవ్వగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ను కొనసాగిస్తూ 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా మ్యాచ్ను ముగించాడు.
కివీస్ బౌలింగ్లో మ్యాట్ హెన్రీ (1/28), ఇష్ సోధి (1/28) వికెట్లు తీసినా, భారత బ్యాటర్ల దాడికి వారి వద్ద సమాధానం లేకుండా పోయింది. జాకబ్ డఫీ, కైల్ జేమీసన్, శాంట్నర్ అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక ఓవర్లో కనిష్టంగా 11 పరుగులు వచ్చాయంటే భారత బ్యాటర్లు ఎంతటి క్రూరంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కేవలం 60 బంతుల్లోనే 155 పరుగులు సాధించి భారత్ తన అత్యంత వేగవంతమైన ఛేదనల్లో ఒకటిగా దీనిని నమోదు చేసింది.
వరల్డ్ కప్కు మరికొన్ని రోజులే సమయం ఉన్న వేళ టీమిండియా ప్రదర్శన ప్రత్యర్థి జట్లకు భయం పుట్టిస్తోంది. వరుసగా మూడు విజయాలతో సిరీస్ను కైవసం చేసుకోవడం జట్టులోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. కివీస్ జట్టు కనీసం ఒక్క విభాగంలో కూడా భారత్కు పోటీ ఇవ్వలేకపోయింది. ఇదే ఊపును తర్వాతి రెండు మ్యాచ్ల్లోనూ కొనసాగించి 5-0తో వైట్వాష్ చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
Image Credit – ESPN Cric Info
Gulte Telugu Telugu Political and Movie News Updates