వింత వ్యాధికి అసలు కారణం బయటపడిందా ?

ఏలూరులో కలకలం రేపుతున్న వింతవ్యాధికి అసలు కారణాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. క్రిమిసంహార మందుల్లో ఉండే ఆర్గానో క్లోరిన్ కారణంగానే మనుషుల మెదడుపై తీవ్ర ప్రబావం చూపుతున్నట్లు గుర్తించారు. పంటల్లో వాడే క్రిమిసంహారక మందులు, దోమలు, బొద్దింకలు, ఈగలు తదితర క్రిమిసంహారకాలకు వాడే రశాయనాలు తాగునీటిలో విపరీతంగా కలిసిపోయినట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. నీటిలో ఉండాల్సినదానికన్నా కొన్ని వేల రెట్లు క్రిమిసంహారకాలు చేరిపోయినట్లు నీటి శాంపుల్సు పరీక్షల్లో తేలింది.

వింతవ్యాధికి కారణాలపై ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్, సీసీఎంబి లాంటి ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్ధల్లోని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరి అద్యయనంలో తాగునీటిలో సీసం, నికెల్ లాంటి రశాయనాలతో పాటు ఆర్గానో క్లోరిన్ అనే ప్రమాదకరమైన రశాయనం కూడా కలిసినట్లు ప్రదామిక పరీక్షల్లో బయటపడింది.

ఇదే సమయంలో జాతీయ పోషకాహార సంస్ధ (ఎన్ఐఎన్) నిపుణులు కూడా ఏలూరులోనే క్యాంపు వేసి ప్రజలు వాడే కూరగాయలు, పాలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, నూనె తదితరాల శాంపిళ్ళను సేకరించి పరిశొధనలు చేస్తోంది. క్రిమిసంహారకాలను పరిమితికి మించి వాడినపుడు బయటపడే దుష్ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని వీరు అధ్యయనం చేస్తున్నారు. కూరగాయాలు, ఆకుకూరల పంటలపై క్రిమిసంహారకాలు విపరీతంగా వాడుతున్నారనే విషయాన్ని ఎన్ఐఎన్ నిపుణులు గ్రహించారు.

పరిమితికిమించిన రశాయనాలు మనుషుల శరీరాల్లోకి చేరిపోవటం వల్ల అదంతా బ్రైన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని శాస్త్రజ్ఞలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వీటిని వాడుతున్నది ఇపుడు అనారోగ్యానికి గురైన బాధితులు మాత్రమే కాదు. ఏలూరు నగరంలో ఉండే సుమారు 4.5 లక్షల మందీ దాదాపు ఇవే వాడుతున్నారు. మరి వాళ్ళందరిపైనా ఇటువంటి ప్రభావాలు ఎందుకు కనబడటం లేదు ? అనే విషయంపైన కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఏదేమైనా తొందరలోనే వింతవ్యాధి మూలకారణాలు బయటపడతాయనే అనుకుంటున్నారు.