గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..

ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. గోవా వెళ్లాలంటేనే జనం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా గోవా మీద నెగటివ్ టాక్ బాగా నడుస్తోంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.

గోవాలో టూరిస్టులను చూస్తే చాలు.. డబ్బులు ఎలా లాగాలా అని చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ట్యాక్సీ వాళ్లు చెప్పే రేట్లు వింటే షాక్ అవ్వాల్సిందే. కిలోమీటరు దూరానికి కూడా వందల్లో చార్జ్ చేస్తున్నారు. ఇక హోటల్స్, క్లబ్స్ లో హిడెన్ చార్జీల పేరుతో బాదేస్తున్నారు. ఇక అమ్మాయిల వలతో మోసపోతున్న వారి సంఖ్య ఎక్కువే. గోవాలో అయ్యే ఖర్చుతో హ్యాపీగా థాయ్లాండ్, వియత్నాం లాంటి దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చని జనం ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే చాలామంది గోవా ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు.

గోవా అంటే సేఫ్ అనే పేరు ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు లేడీస్ కి, ఫారిన్ నుంచి వచ్చే వాళ్లకు రక్షణ లేకుండా పోయింది. బీచ్ లలో ఆకతాయిలు ఫారినర్స్ తో మిస్ బిహేవ్ చేయడం, ఫోటోల పేరుతో ఇబ్బంది పెట్టడం ఎక్కువైపోయింది. ఇలాంటి వీడియోలు బయటకి రావడంతో గోవా పరువు గంగలో కలిసింది. దీంతో విదేశీ టూరిస్టులు గోవా వైపు చూడటమే మానేశారు. ఇంత జరుగుతున్నా అక్కడి గవర్నమెంట్ మాత్రం లైట్ తీసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. టూరిస్టులు కంప్లైంట్ ఇచ్చినా, అధికారులు పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదనే ఆరోపణలు వచ్చాయి. స్కాములు జరుగుతున్నాయని తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. కేవలం డబ్బులు వస్తే చాలు అనేలా వ్యవహరిస్తున్నారు తప్ప, జనం సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదు.

రీసెంట్ గా నైట్ క్లబ్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో 25 మంది చనిపోయారు. దీంతో ఈ ఘటన గోవా ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేసింది. పర్మిషన్లు లేకుండా, సేఫ్టీ రూల్స్ పాటించకుండా క్లబ్ లు నడుపుతున్నా అధికారులు యాక్షన్ తీసుకోవడం లేదు. ఎంజాయ్ చేద్దామని పార్టీకి వెళ్తే ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో గోవా వెళ్లడం రిస్క్ అని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి గోవా అంటే ఇప్పుడు ఎంజాయ్ మెంట్ కాదు.. భయం, మోసం అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పటికైనా అక్కడి సిస్టమ్ మారకపోతే, గోవా బీచ్ లు వెలవెలబోవడం ఖాయం.