హర్యానాలో జరిగిన ఈ ఘోరం గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అందంగా ఉన్నారన్న ఒక్క కారణంతో చిన్న పిల్లలను టార్గెట్ చేసి చంపేసింది ఓ మహిళ. ఆమె పేరు పూనమ్. గత రెండేళ్లలో ఏకంగా నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకుంది. ఇందులో ఆమె సొంత కొడుకు కూడా ఉండటం గమనార్హం. అసలు ఆమె ఎందుకిలా చేసింది అంటే.. పోలీసుల విచారణలో “బ్యూటీ కాంప్లెక్స్” అనే వింత కారణం బయటపడింది. అంటే నా కంటే ఎవరూ అందంగా ఉండకూడదు అనే అసూయ, ఆలోచన ఆమెకు మీతిమీరినట్లు గుర్తించారు.
పూనమ్ టార్గెట్ చేసింది ఎక్కువగా ఆడపిల్లలనే. తనకంటే ఆ పిల్లలు అందంగా ఉన్నారనే అసూయతో రగిలిపోయేదట. ఆ జెలసీతోనే వరుసగా ఇషిక (9), జియా (8) అనే చిన్నారులను చంపేసింది. తాజాగా సోమవారం నాడు తన మేనకోడలు విధి (6) ని కూడా అదే కారణంతో చంపేసింది. ఒక ఫంక్షన్ కోసం రెడీ అయిన ఆ పాపను, మాయమాటలు చెప్పి స్టోర్ రూమ్కి తీసుకెళ్లి, నీళ్ల టబ్లో ముంచి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది.
ఈ సీరియల్ కిల్లర్ కథలో అత్యంత దారుణమైన ట్విస్ట్ ఏంటంటే.. ఆమె తన సొంత కొడుకు శుభమ్ (4) ను కూడా వదలలేదు. అయితే కొడుకును చంపడానికి కారణం అందం కాదు. మొదటి హత్య చేసినప్పుడు అందరికీ తనపై అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని పక్కదారి పట్టించడానికే, సొంత కొడుకును చంపి “నా కొడుకు కూడా చనిపోయాడు, నేనే బాధితురాలిని” అని డ్రామా ఆడింది. తనను ఎవరూ అనుమానించకూడదనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.
నిజానికి విధి అనే పాపను చంపడానికి పూనమ్ 2021లోనే స్కెచ్ వేసింది. అప్పట్లో ఆ పాప ముఖంపై మరుగుతున్న టీ పోసింది. అప్పుడు అది ప్రమాదవశాత్తు జరిగిందని కుటుంబం నమ్మింది. కానీ పాప తండ్రి సందీప్కి మాత్రం అప్పుడే డౌట్ వచ్చింది. అతను ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. వారి నిర్లక్ష్యమే ఇప్పుడు ఆ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది.
చివరికి పోలీసులు పూనమ్ను అరెస్ట్ చేయడంతో ఈ సీరియల్ మర్డర్స్ గుట్టు రట్టయింది. తన అందం తక్కువైపోతుందన్న భావమే ఇంతటి ఘోరాలకు దారి తీస్తుందని ఎవరూ ఊహించలేదు. “కేవలం అసూయతో నా కూతురిని చంపేసింది, ఆమెకు ఉరిశిక్ష వేయాలి” అని విధి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె బయట ఉంటే ఇంకెంతమంది పిల్లలు బలయ్యేవారో అని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates