అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ సినిమా ఫస్ట్ షో పడి 15 గంటలు దాటి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్యాక్డ్ హౌస్‌లతో సినిమా రన్ అవుతుండాలి. కానీ అనూహ్యంగా ఈ సినిమా ప్రిమియర్స్ ఆగిపోయాయి. మొత్తంగా రిలీజ్‌కే బ్రేక్ పడింది. ఈ సినిమాకు ఇలా జరుగుతుందనే సంకేతాలు మొన్నటి వరకు అస్సలు లేవు.

ఏపీలో, విదేశాల్లో బుకింగ్స్ ఎప్పుడో ఓపెన్ అయ్యాయి. మంచి ఊపులో కొనసాగుతున్నాయి. నైజాంలో మాత్రమే బుకింగ్స్ ఆలస్యం అయ్యాయి. అది టికెట్ల రేట్ల పెంపు జీవో రాకలో జరిగిన ఆలస్యం వల్లే అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే.. 14 రీల్స్ ప్లస్ సంస్థ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ ఆగిపోవడం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకే కాక ఇండస్ట్రీకి కూడా పెద్ద షాక్.

ఫైనాన్స్ ఇష్యూలతో సినిమాల రిలీజ్ ఆలస్యం కావడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ ఈ స్థాయి సినిమాకు ఇలాంటి ఇబ్బంది ఎదురు కావడం.. ఎంత ప్రయత్నించిన ఇష్యూ సెటిల్ కాక రిలీజ్ ఆగిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ‘అఖండ-2’ టీంలోని వారి పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పని లేదు. ఈ అనుభవం ఇండస్ట్రీకి పెద్ద పాఠం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనాన్స్ తీసుకున్నపుడు, సెటిల్ చేయాల్సిన టైం వచ్చినపుడు తేలిగ్గా తీసుకుని.. రిలీజ్ తర్వాత చూసుకుందాంలే అనుకుంటే ఏమవుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. మిగతా సమయాల్లో నిర్మాతలతో సెటిల్ చేసుకోలేక ఇబ్బంది పడే ఫైనాన్షియర్లు కూడా రిలీజ్ టైంలో పీక మీద కత్తి పెట్టి, కోర్టుకు వెళ్లి తమకు కావాల్సింది సాధించుకోవచ్చని ఈ మార్గాన్నేఎంచుకునే అవకాశముంది.

ఇటీవల ‘రాజా సాబ్’ లాంటి పెద్ద సినిమాకు కూడా ఫైనాన్స్ విషయంలో ఒక వివాదం నడిచిన సంగతి తెలిసిందే. దాని గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఐతే ఆ ఇష్యూ మొత్తం సెటిలైందా అన్నది సందేహమే. ఇంకా వివాదం ఉంటే ముందే సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఆ సినిమా అనే కాక.. ఇక ముందు ఫైనాన్స్ విషయంలో ప్రతి నిర్మాతా జాగ్రత్తగా ఉండాల్సిందే. ముందే సెటిల్మెంట్ జరక్కపోతే.. రిలీజ్ టైంలో ఇలాంటి అనుభవం ఎదురైతే భారీ నష్టాలు తప్పవు. కాబట్టి ‘అఖండ-2’ అనుభవాన్ని అందరూ ఒక పాఠంలా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.