కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆ నమ్మకం ఓడిపోయింది. దాదాపు ఆరేళ్ల (2,462 రోజులు) తర్వాత.. కోహ్లీ సెంచరీ కొట్టినా భారత్ ఓడిపోయిన అరుదైన మ్యాచ్‌గా ఇది చరిత్రలో నిలిచింది. వరుసగా రెండు సెంచరీలు బాది కోహ్లీ వింటేజ్ ఫామ్ చూపించినా, చివరికి సఫారీలే పైచేయి సాధించి సిరీస్‌ను సమం చేశారు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 93 బంతుల్లోనే 102 పరుగులు చేసి, తన 53వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (105) తో కలిసి 195 పరుగుల భారీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా, దక్షిణాఫ్రికా దాన్ని ఛేజ్ చేసి రికార్డు సృష్టించింది. ఇది భారత్‌పై సఫారీలకు అత్యంత భారీ ఛేజింగ్ విజయాల్లో ఒకటిగా నిలిచింది.

2019 మార్చిలో ఆస్ట్రేలియాపై రాంచీలో కోహ్లీ సెంచరీ చేసినా భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. ముఖ్యంగా కోహ్లీ సెంచరీ చేసి, భారత్ భారీ స్కోరు సాధించి డిఫెండ్ చేసుకునే క్రమంలో ఓడిపోవడం గత 8 ఏళ్లలో ఇదే తొలిసారి. 2017లో న్యూజిలాండ్ చేతిలో ఇలాగే ఓడిపోయాం. అంటే కోహ్లీ సెంచరీ ‘లక్కీ చార్మ్’ ఈసారి వర్కవుట్ కాలేదన్నమాట.

సఫారీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (110) అద్భుత సెంచరీతో కోహ్లీ శ్రమను వృథా చేశాడు. బ్రీట్జ్‌కే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో సహకరించడంతో లాస్ట్ ఓవర్ డ్రామాలో సౌతాఫ్రికా విజయం సాధించింది. కోహ్లీకి ఇది ఓడిపోయిన మ్యాచ్‌లలో 8వ సెంచరీ కావడం విశేషం. ఏది ఏమైనా, 2025లో కోహ్లీ ఫామ్ మాత్రం పీక్స్‌లో ఉంది. ఈ ఏడాది 12 ఇన్నింగ్స్‌లలో 586 పరుగులు, 3 సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఈ మ్యాచ్ ఓడినా, కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకాడు. సిరీస్ 1-1తో సమం అవ్వడంతో, చివరి మ్యాచ్ ఫైనల్ లాగా మారింది. అక్కడైనా కోహ్లీ సెంచరీతో పాటు గెలుపు కూడా దక్కుతుందేమో చూడాలి.