కొత్త ఫోన్ కొంటున్నారా… ఐతే ఈ యాప్ ఉండాల్సిందే!

కొత్తగా ఫోన్ కొంటున్నారా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇకపై మీరు కొనే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్లో ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) అనే గవర్నమెంట్ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి రావాల్సిందే. ఆపిల్, శాంసంగ్, షావోమీ, వివో, ఒప్పో వంటి మొబైల్ తయారీ సంస్థలన్నింటికీ కేంద్ర టెలికాం శాఖ DoT ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కొత్త నిబంధనను పాటించడానికి కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చారు. ఫోన్ బాక్స్ ఓపెన్ చేసి ఆన్ చేయగానే ఈ యాప్ స్క్రీన్ మీద కనిపించాలి. దీనివల్ల లాభం ఏంటంటే.. సైబర్ మోసాలు, ఫోన్ దొంగతనాలు జరిగినప్పుడు వేగంగా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఇప్పటివరకు ‘సంచార్ సాథీ’ పోర్టల్‌కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ యాప్ ఉంటే ఒక్క క్లిక్‌తో పని అయిపోతుంది. దీనికి ఓటీపీ వెరిఫికేషన్ కూడా అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ యాప్‌ను డిలీట్ చేయలేము అనే వార్తలు వస్తున్నాయి. కానీ అది అబద్ధమని, కావాలంటే యూజర్లు దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని టెలికాం శాఖ అధికారి ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం యూజర్ల సేఫ్టీ కోసమే తప్ప, వారిని ఇబ్బంది పెట్టడానికి కాదని స్పష్టం చేశారు.

ఈ యాప్ ద్వారా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు, ఫోన్ పోతే వెంటనే బ్లాక్ చేయించవచ్చు, మీకు వచ్చే ఫేక్ మెసేజ్‌లు, కాల్స్‌పై ఫిర్యాదు చేయవచ్చు. గత మూడు, నాలుగేళ్లలో సైబర్ మోసాల వల్ల జనం దాదాపు 35 వేల కోట్లు నష్టపోయారు. ఈ ఫ్రాడ్స్‌కి చెక్ పెట్టడానికే ప్రభుత్వం ఈ సీరియస్ స్టెప్ తీసుకుంది.

మీ ఫోన్ పోయినా సరే, ఈ పోర్టల్ ఎంత అడ్వాన్స్‌డ్ అంటే.. మీరు IMEI నంబర్ గుర్తుపెట్టుకోకపోయినా కంప్లైంట్ ఇవ్వొచ్చు. మోసగాళ్లు రెచ్చిపోతున్న ఈ టైంలో, ఇలాంటి గవర్నమెంట్ యాప్ ప్రతి ఫోన్లో ఉండటం యూజర్లకు ఒక అదనపు రక్షణ కవచం లాంటిదే.