పాన్ మసాలా కింగ్ కోడలి మృతి.. షాకింగ్ ఆరోపణలు

ఢిల్లీలోని వసంత్ విహార్‌లో జరిగిన పాన్ మసాలా టైకూన్ కమలా పసంద్ కోడలి ఆత్మహత్య కేసులో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఇదొక సాదాసీదా ఆత్మహత్య అనుకున్నారు. డైరీలో రాసిన మాటలను బట్టి భార్యాభర్తల గొడవలే కారణమని భావించారు. కానీ, మృతురాలి సోదరుడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు వింటే అసలు కథ వేరే ఉందనిపిస్తోంది.

మృతురాలి సోదరుడి ఆరోపణల ప్రకారం, ఆమెను అత్తింటివారు చిత్రహింసలు పెట్టేవారు. కేవలం మాటలతో వేధించడమే కాదు, భర్త, అత్త కలిసి ఆమెను కొట్టేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ బాధలు భరించలేక ఆమెను కోల్‌కతాలోని పుట్టింటికి తీసుకెళ్తే, అత్తింటివారు వచ్చి మళ్ళీ ఇలా జరగదు, బాగా చూసుకుంటాం అని నమ్మబలికి ఢిల్లీ తీసుకెళ్లారట. కానీ అక్కడ సీన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. వాళ్ళ మాటలు నమ్మి వచ్చినందుకు ఆమె ప్రాణాలే తీసుకోవాల్సి వచ్చింది.

అసలు విషయం ఏంటంటే.. ఆమె భర్తకు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని సోదరుడు ఆరోపించాడు. అంతటితో ఆగకుండా, భర్త రహస్యంగా రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని, ముంబైలో అతనికి ఒక బిడ్డ కూడా ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అత్తింటివారు ఈ విషయాన్ని దాచిపెట్టి, కొడుకును వెనకేసుకురావడంతో ఆమె మానసికంగా కృంగిపోయిందని వాపోయాడు. భర్తకు అక్రమ సంబంధాలు, ఇంట్లో వేధింపులే ఆమెను చంపేశాయని సోదరుడు కన్నీరుమున్నీరయ్యాడు.

అయితే, ఈ ఆరోపణలను పాన్ మసాలా వ్యాపారి ఫ్యామిలీ లాయర్ రాజేందర్ సింగ్ పూర్తిగా ఖండించారు. ఇవన్నీ అబద్ధాలని, నిరాధారమైనవని కొట్టిపారేశారు. రెండు కుటుంబాలు ఇప్పుడు బాధలో ఉన్నాయని, మృతురాలికి గౌరవంగా అంత్యక్రియలు జరగాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఆమె రాసిన నోట్‌లో ఎవరి పేరు లేదని, ఎవరినీ నిందించలేదని, ఇదొక దురదృష్టకరమైన ఘటన అని ఆయన వాదిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన డైరీలో ‘రిలేషన్ షిప్ ఇష్యూస్’ అని రాసి ఉండటం, ఇప్పుడు సోదరుడు చేసిన సీరియస్ ఆరోపణలు కేసును కొత్త మలుపు తిప్పాయి. భర్త జిమ్‌కు వెళ్లిన సమయంలో, పిల్లలు స్కూల్‌కు వెళ్లినప్పుడు ఆమె ఒంటరిగా ఉండి ఈ ఘోరానికి ఒడిగట్టింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్, కుటుంబ సభ్యుల విచారణ తర్వాత ఈ హై ప్రొఫైల్ కేసులో అసలు దోషులు ఎవరో తేలనుంది.