పాకిస్థాన్ కంటే కిందకి టీమిండియా..

గువాహటిలో ఘోర ఓటమి తర్వాత టీమిండియా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అవ్వడమే కాకుండా, ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC 2025-27) పాయింట్ల పట్టికలో ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (4వ స్థానం) కంటే మనం కిందకు దిగజారిపోవడం. సొంతగడ్డపై పులుల్లా ఉండే మనోళ్లు, ఇలా పిల్లుల్లా మారిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు.

అసలు ఈ మ్యాచ్‌లో భారత్ ప్రదర్శనకు ఊహించని స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 549 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగితే, కనీసం పోరాడకుండానే చేతులెత్తేశారు. కేవలం 140 పరుగులకే కుప్పకూలి, 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయారు. పరుగుల పరంగా టెస్ట్ చరిత్రలో భారత్‌కు ఇదే అతిపెద్ద ఓటమి.

ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక చూస్తే.. ఆస్ట్రేలియా 100% రికార్డుతో టాప్‌లో ఉండగా, సౌతాఫ్రికా రెండో ప్లేస్‌కు దూసుకెళ్లింది. శ్రీలంక, పాకిస్థాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి 50% పాయింట్లతో మనకంటే మెరుగైన స్థానంలో ఉంది. మనం ఈ సైకిల్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడితే, అందులో 4 ఓడిపోయి 48.15% పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమయ్యాం.

ఈ సిరీస్ ఓటమితో 25 ఏళ్ల కోట బద్దలైంది. పాతికేళ్ల తర్వాత సౌతాఫ్రికా మన గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో మనవాళ్లు బ్యాట్ పట్టుకోవడం మర్చిపోతే, సౌతాఫ్రికా ప్లేయర్ మార్క్రమ్ మాత్రం బాల్ ను అస్సలు వదల్లేదు. ఏకంగా 9 క్యాచ్‌లు పట్టి, ఒకే టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా అజింక్య రహానే రికార్డును బద్దలు కొట్టాడు.

“ఇదొక నిరుత్సాహ పరిచే ఓటమి. ప్రత్యర్థి మాకంటే బాగా ఆడాడు” అంటూ స్టాండ్ ఇన్ కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ తర్వాత తలదించుకున్నాడు. వరుసగా రెండుసార్లు WTC ఫైనల్ చేరిన భారత్, ఈసారి ఆశలు గల్లంతైనట్లే కనిపిస్తోంది. మళ్లీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతాలు చేయాల్సిందే.