దుబాయ్ తేజస్ ప్రమాదం.. ఎవరీ నమాంశ్‌ స్యాల్?

దుబాయ్ ఎయిర్ షోలో ఊహించని విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత్ గర్వంగా ప్రదర్శించిన ‘తేజస్’ యుద్ధ విమానం విన్యాసాలు చేస్తూ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వేల అడుగుల ఎత్తులో సాహసోపేతమైన విన్యాసాలు చేస్తుండగా, క్షణాల్లోనే విమానం అదుపు తప్పి నేలకూలింది. దురదృష్టవశాత్తూ, పైలట్ ఎజెక్ట్ అయ్యే అవకాశం కూడా దక్కలేదు.

అసలు ఎవరీ నమాంశ్‌ స్యాల్?

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా, పటియాల్కర్ గ్రామానికి చెందిన నమన్ష్ వయసు 34 ఏళ్లు. చిన్నప్పటి నుంచే దేశ సేవ చేయాలనే తపనతో సైనిక్ స్కూల్‌లో చదివారు. అంచెలంచెలుగా ఎదిగి వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం స్క్వాడ్రన్ లీడర్‌గా ఉన్న ఆయనకు త్వరలోనే ప్రమోషన్ కూడా రాబోతోందని బంధువులు చెబుతున్నారు. కానీ, అంతలోనే విధి చిన్నచూపు చూసింది.

నమాంశ్‌ కుటుంబం మొత్తం దేశ సేవకే అంకితమైంది. ఆయన భార్య కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఆఫీసరే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలో ఉన్నారు. వీరికి ఆరేళ్ల చిన్న పాప ఉంది. ఇక నమాంశ్‌ తండ్రి జగన్నాథ్ స్యాల్ కూడా గతంలో ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత ప్రిన్సిపాల్‌గా సేవలు అందించారు. కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం తమిళనాడులోని సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నెగటివ్ జి మ్యాన్యువర్’ అనే అత్యంత క్లిష్టమైన విన్యాసం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. తక్కువ ఎత్తులో విమానాన్ని నియంత్రించలేకపోవడంతో, వేగంగా వచ్చి నేలను ఢీకొట్టింది. ఇంపాక్ట్ జరగడానికి కొన్ని క్షణాల ముందు విమానం లెవల్‌గానే ఉన్నా, వర్టికల్ స్పీడ్ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాన్ని నివారించలేకపోయారు. దేశ రక్షణ కోసం, దేశ కీర్తిని పెంచడం కోసం ప్రాణాలర్పించిన ఈ వీర సైనికుడి మరణం పట్ల యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలుకుతోంది.