4వ తరగతిలో ఆత్మహత్య.. రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

జైపూర్‌లోని ప్రముఖ ‘నీర్జా మోదీ స్కూల్’లో 4వ తరగతి చదువుతున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. నవంబర్ 1న స్కూల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆ పాప ప్రాణాలు తీసుకుంది. అయితే, ఇది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక 18 నెలల పాటు సాగిన భయంకరమైన ర్యాగింగ్, వేధింపులు ఉన్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రిపోర్ట్ తేల్చింది. తోటి విద్యార్థుల వేధింపులు తాళలేకే ఆ చిన్నారి ఈ ఘోరానికి ఒడిగట్టింది.

అసలు విషయం ఏంటంటే, క్లాస్‌మేట్స్ ఆ పాపను చెడు మాటలతో పిలిచేవారని తేలింది. కొన్నిసార్లు లైంగిక అర్థాలు వచ్చేలా బూతులు తిట్టేవారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై పేరెంట్స్ పదే పదే క్లాస్ టీచర్‌కు, స్కూల్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. “మా పాపను ఏడిపిస్తున్నారు, కాపాడండి” అని మొరపెట్టుకున్నారు. కానీ, టీచర్ ఆ ఫిర్యాదులను పెడచెవిన పెట్టారు. స్కూల్ యాజమాన్యం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో తమ చిన్నారికి దిక్కులేకుండా పోయిందని పేరెంట్స్ ఆరోపించారు.

CBSE దర్యాప్తులో స్కూల్ సేఫ్టీ డొల్లతనం కూడా బయటపడింది. అసలు గ్రౌండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ ఉన్న ఆ అమ్మాయి, నాలుగో అంతస్తుకు వెళ్తుంటే ఎవరూ ఎందుకు గమనించలేదు? అని రిపోర్ట్ ప్రశ్నించింది. పై అంతస్తుల్లో ప్రమాదాలు జరగకుండా ఉండాల్సిన సేఫ్టీ నెట్స్ కూడా అక్కడ లేవు. స్కూల్ నిర్లక్ష్యం, నిఘా వైఫల్యం కారణంగానే ఒక అమాయక చిన్నారి ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని రిపోర్ట్ స్పష్టం చేసింది.

సీసీటీవీ ఫుటేజ్, తల్లిదండ్రుల స్టేట్‌మెంట్స్ ఆధారంగా కమిటీ కొన్ని కీలక విషయాలను గమనించింది. ఆ రోజు క్లాస్‌లో ఏదో గొడవ జరిగిందని, తోటి విద్యార్థులతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పాప చాలా డిస్టర్బ్‌గా, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో కనిపించిందని రిపోర్ట్ పేర్కొంది. తోటి పిల్లలు అన్న మాటలు, చేసిన వెకిలి చేష్టలు ఆ పసి మనసును ముక్కలు చేశాయి.

“ఒక ఇన్నోసెంట్ చైల్డ్” ప్రాణాన్ని కాపాడటంలో స్కూల్ పూర్తిగా విఫలమైందని రిపోర్ట్ తేల్చిచెప్పింది. ర్యాగింగ్ అనేవి కాలేజీల్లోనే కాదు, స్కూల్స్‌లో కూడా ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ ఘటన కళ్ళకు కట్టింది. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని టీచర్ల నిర్లక్ష్యమే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఇప్పటికైనా స్కూల్స్ ఇలాంటి విషయాల్లో సీరియస్‌గా ఉండకపోతే, ఇంకెందరో చిన్నారులు ఇలా బలైపోయే ప్రమాదం ఉందని తోటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.