“మేమే కొట్టాం.. రెడ్ ఫోర్ట్ బాంబ్ మా పనే!” పాక్ నేత ఓపెన్ స్టేట్‌మెంట్!

ఢిల్లీ ఎర్రకోట వద్ద 15 మందిని బలితీసుకున్న కారు బాంబు పేలుడు వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ చెబుతూనే ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ, ఒక పాక్ నాయకుడు ఓపెన్‌గా ఒప్పుకోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పాక్ సీనియర్ రాజకీయ నాయకుడు చౌదరి అన్వరుల్ హక్, అసెంబ్లీ సాక్షిగా షాకింగ్ కామెంట్స్ చేశారు. “మీరు బెలూచిస్తాన్‌లో చిచ్చు పెడితే.. మేం ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు మిమ్మల్ని దెబ్బకొడతాం. అల్లా దయతో మా వాళ్లు అది చేసి చూపించారు” అంటూ ఈ ఘాతుకాన్ని తమ విజయంగా చెప్పుకోవడం సంచలనమైంది.

ఈ వ్యాఖ్యలు మరువక ముందే, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా యుద్ధం గురించి మాట్లాడటం ఉద్రిక్తతను పెంచుతోంది. భారత్‌తో “పూర్తి స్థాయి యుద్ధం” వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఆయన ప్రకటించారు. బెలూచిస్తాన్‌లో జరుగుతున్న అల్లర్లకు భారతే కారణమని పాక్ ఆరోపిస్తుంటే, అదంతా ఉగ్రవాద చర్యల నుంచి ప్రపంచం దృష్టి మళ్లించే డ్రామా అని ఢిల్లీ కొట్టిపారేస్తోంది. కానీ, తాజా స్టేట్‌మెంట్లతో పాక్ తన ఉగ్రరూపాన్ని మరోసారి బయటపెట్టుకుంది.

మరోవైపు, ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో భారత అధికారులకు కీలక ఆధారాలు దొరికాయి. ఈ దాడికి వాడిన హ్యుందాయ్ i20 కారు, అందులోని పేలుడు పదార్థాలు జైష్ ఎ మొహమ్మద్ (JeM) పనేనని తేలింది. హర్యానాలోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ డాక్టర్లను, కాశ్మీర్‌కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ బ్రెయిన్ వాష్ చేసి ఈ ‘టెర్రర్ డాక్టర్’ మాడ్యూల్‌ను తయారు చేశాడు. వీరికి పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో డైరెక్ట్ లింకులు ఉన్నాయని ఇంటెలిజెన్స్ గుర్తించింది.

ఇదిలా ఉంటే, జైష్ ఉగ్రసంస్థ ఇప్పుడు నిధుల కోసం “డిజిటల్ భిక్షాటన” మొదలుపెట్టింది. మరిన్ని ఆత్మాహుతి దాడుల కోసం ‘సదాపే’ వంటి యాప్స్ ద్వారా ఒక్కొక్కరి నుంచి 20 వేల చొప్పున విరాళాలు వసూలు చేస్తోంది. అంతేకాదు, మసూద్ అజార్ సోదరి సాదియా నేతృత్వంలో ఒక మహిళా విభాగాన్ని కూడా రంగంలోకి దింపింది. ఎర్రకోట కేసులో అనుమానితురాలైన డాక్టర్ షాహీనా (కోడ్ నేమ్: మేడమ్ సర్జన్) కూడా ఈ గ్రూప్ మెంబరే కావడం గమనార్హం.

రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే తోయిబా, జైష్ కలిసి మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్ ఆర్మీ సపోర్ట్‌తో ఈ రెండు గ్రూపులు కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎర్రకోట పేలుడు కేవలం ఆరంభం మాత్రమేనని, సరిహద్దు ఆవల నుంచి ఇంకా పెద్ద ముప్పు పొంచి ఉందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.