పిచ్ రచ్చ.. గంభీర్‌పై వేటు? గంగూలీ స్ట్రాంగ్ రియాక్షన్ ఇదే!

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోవడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ నాసిరకంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా దూరమవ్వడం ఒక కారణమైతే, పిచ్ స్వభావం టీమిండియాను దెబ్బతీసిందనేది మరో వాదన. ఈ ఓటమితో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఒత్తిడి పెరిగింది. అతడిని హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా దాదా, క్యాబ్ (CAB) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ సంచలన విషయాలు బయటపెట్టారు.

ముందుగా పిచ్ వివాదంపై గంగూలీ క్లారిటీ ఇచ్చారు. పిచ్ తయారీలో తన ప్రమేయం అస్సలు ఉండదని చెప్పారు. “మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందే బీసీసీఐ క్యూరేటర్లు వచ్చి వికెట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. లోకల్ క్యూరేటర్లు కేవలం వాళ్లు చెప్పినట్లు చేస్తారంతే” అని గంగూలీ వివరించారు. అయితే, ఈడెన్ పిచ్ అస్సలు బాగోలేదని ఆయన ఒప్పుకున్నారు. “ఇది గ్రేటెస్ట్ వికెట్ కాదు. మన టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇంతకంటే మంచి పిచ్‌లపై ఆడటానికి అర్హులు. స్టేడియం నిండా జనం వచ్చినప్పుడు మంచి క్రికెట్ అందించాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు, లోకల్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ మాత్రం బంతిని టీమ్ మేనేజ్‌మెంట్ కోర్ట్‌లోకి నెట్టేశారు. “మేము కోచ్, కెప్టెన్ ఏం అడిగితే అదే చేస్తాం. గంభీర్ కూడా మ్యాచ్ తర్వాత చెప్పాడు కదా.. తనకు కావాల్సిన పిచ్ దొరికిందని. సో, మేం వారి ఆర్డర్స్ ఫాలో అయ్యాం అంతే” అని తేల్చి చెప్పారు. అంటే, ఇండియా ఓటమికి కారణమైన పిచ్‌ను అడిగి మరీ చేయించుకుంది గంభీర్ టీమే అని పరోక్షంగా అర్థమవుతోంది.

ఇంత జరిగినా, గంభీర్‌ను కోచ్‌గా తప్పించాలన్న వాదనను గంగూలీ కొట్టిపారేశారు. “ఈ దశలో గంభీర్‌ను తొలగించాల్సిన అవసరమే లేదు” అని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ సిరీస్‌ను ఉదాహరణగా చూపిస్తూ.. “అక్కడ మంచి బ్యాటింగ్ పిచ్‌లపై గంభీర్ కోచింగ్‌లో, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతంగా ఆడింది. ఇండియాలో కూడా వారు కచ్చితంగా రాణిస్తారు” అని భరోసా ఇచ్చారు. గంగూలీ మాటలను బట్టి చూస్తే.. పిచ్ విషయంలో గంభీర్ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టినా, మాజీ కెప్టెన్‌గా గంగూలీ మద్దతు మాత్రం ప్రస్తుత కోచ్‌కే ఉందని అర్థమవుతోంది. అయితే, తర్వాతి మ్యాచ్‌ల్లోనైనా బ్యాటర్లకు అనుకూలించే వికెట్లు ఉండాలని దాదా కోరుకుంటున్నారు.