6 ఏళ్ల పోరాటం.. పరిహారంగా రూ.317 కోట్లు

ఆరేళ్ల న్యాయ పోరాటం, ఒక గ్లోబల్ విమానయాన దిగ్గజంతో యుద్ధం, చివరకు దిమ్మతిరిగే విజయం. ఇది 2019 విమాన ప్రమాదంలో చనిపోయిన శిఖా గార్గ్ కుటుంబం సాధించిన విజయం. బోయింగ్ 737 MAX విమాన డిజైన్ లోపం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆ కుటుంబం చేసిన పోరాటానికి, అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు రూ. 317 కోట్లు (35.85 మిలియన్ డాలర్లు) పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

అసలు ఎవరీ శిఖా గార్గ్?

2019, మార్చిలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం (బోయింగ్ 737 MAX) కూలిపోయిన ఘటనలో 150 మందికి పైగా చనిపోయారు. వారిలో శిఖా గార్గ్ ఒకరు. ఆమె ఐక్యరాజ్యసమితి (UN)లో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. యూఎన్ ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీ మీటింగ్‌లో పాల్గొనడానికి నైరోబీ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. భారతీయ సంప్రదాయాలంటే ఎంతో ఇష్టపడే శిఖ, ఆ రోజు చీరకట్టులోనే విమానం ఎక్కారని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.

ఈ ప్రమాదానికి 5 నెలల ముందే ఇండోనేసియాలో మరో బోయింగ్ 737 MAX విమానం కూలిపోయింది. ఈ రెండు ప్రమాదాల్లో కలిపి 340 మంది మరణించారు. దీనికి కారణం విమానం మోడల్ డిజైన్‌లో ఉన్న తీవ్రమైన లోపమే. ఈ భయంకరమైన లోపం గురించి బోయింగ్ సంస్థ ప్రజలను హెచ్చరించడంలో విఫలమైందని శిఖ కుటుంబం ఆరోపించింది. చాలా మంది బాధితులు పరిహారం తీసుకుని సెటిల్ అయినా, శిఖ కుటుంబం మాత్రం బోయింగ్‌ను కోర్టుకీడ్చింది.

ఈ కేసులో ఆరేళ్లపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. విమాన తయారీ సంస్థ నిర్లక్ష్యం వల్లే అమాయకులు చనిపోయారని శిఖ కుటుంబం తరఫు న్యాయవాదులు బలంగా వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన షికాగో ఫెడరల్ జ్యూరీ, శిఖ కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 317 కోట్లు చెల్లించాలని బోయింగ్‌ను ఆదేశించింది. ఈ రెండు వరుస ప్రమాదాల తర్వాతే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేగింది. అన్ని దేశాలూ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కార్యకలాపాలను వెంటనే నిలిపివేశాయి. లోపాలను సరిదిద్దిన తర్వాత, దాదాపు 20 నెలల విరామం అనంతరం 2020 డిసెంబర్‌లో ఈ విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరడం మొదలుపెట్టాయి.