ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ మరల తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో టీమిండియా పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో గెలిచి తొమ్మిదో ఆసియా కప్ను ముద్దాడింది. లక్ష్యం చేధనలో ఒక దశలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత జట్టును తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతంగా కాపాడాడు. 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్ గా నిలిచిన తిలక్ జట్టుకు చారిత్రాత్మక విజయం అందించాడు. చివర్లో రింకూ సింగ్ బౌండరీతో మ్యాచ్ను ముగించాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసింది. అయితే పాక్ ఇన్నింగ్స్ను కుల్దీప్ యాదవ్ స్పిన్ పవర్ తో కట్టడి చేశాడు. సహిబ్జాద ఫర్హాన్ (57) హాఫ్ సెంచరీతో రాణించగా, ఫకార్ జమాన్ (46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమవడంతో పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ (4/30) వికెట్ల వేట సాగించగా, వరుణ్ చక్రవర్తీ (2/30), అక్షర్ పటేల్ (2/26), బుమ్రా (2/25) కీలకంగా నిలిచారు.
ఇక లక్ష్యం చేధనలో భారత్ 20 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అభిషేక్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (1), శుభ్మన్ గిల్ (12) నిరాశ పరిచారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సంజూ శాంసన్ కలిసి జట్టును గాడిలో పెట్టారు. సంజూ (24) చిన్న ఇన్నింగ్స్ ఆడినా, ఇద్దరి భాగస్వామ్యం 57 పరుగులు జట్టును కాపాడింది. తరువాత శివమ్ దూబే (33) దూకుడు ప్రదర్శించడంతో తిలక్కు అండగా నిలిచాడు. ఈ జోడీ మ్యాచ్లో భారత్ గెలుపు ఆశలను మళ్లీ రగిలించింది.
చివరి ఓవర్లలో తిలక్ వర్మ తన ప్రతిభను ప్రదర్శించాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, కీలక సమయాల్లో సిక్స్లు, బౌండరీలు బాది ఒత్తిడిని తగ్గించాడు. దూబే కూడా 22 బంతుల్లో 33 పరుగులతో సత్తా చాటాడు. చివరి ఓవర్లో తిలక్ సిక్స్ బాదగా, రింకూ సింగ్ బౌండరీ కొట్టి విజయాన్ని ఖరారు చేశాడు. 19.4 ఓవర్లలో భారత్ 150/5 స్కోరు చేసి విజేతగా నిలిచింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్ (3/29) మెరుపులు చూపినా జట్టుకు ఫలితం రాలేదు.
ఈ గెలుపుతో భారత్ ఆసియా కప్ చరిత్రలో తొమ్మిదో టైటిల్ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా పాకిస్థాన్తో ఒకే టోర్నీలో మూడుసార్లు తలపడగా, మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం గర్వకారణం. తిలక్ వర్మ ధైర్యవంతమైన ఇన్నింగ్స్, కుల్దీప్ స్పిన్ మాయా ఈ ఫైనల్ను ప్రత్యేకంగా మార్చాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates