అమ్ముడవని ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు

ప్రత్యర్థి ఎవరైనా సరే.. భారత జట్టు మ్యాచ్ ఆడుతోందంటే క్రికెట్ ప్రపంచమంతా అటు వైపు చూస్తుంది. ఇక ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఎలా ఊగిపోతారో తెలిసిందే. అందులోనూ మల్టీ నేషన్స్ టోర్నీల్లో ఇండియా ఆడుతుంటే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ బుధవారం నాడు ఆసియా కప్ టోర్నీలో భారత తన తొలి మ్యాచ్ ఆడినట్లు చాలామంది ఇండియన్ ఫ్యాన్స్‌కు తెలియని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. మామూలుగా ఆసియా కప్‌కు అభిమానుల్లో మంచి డిమాండే ఉంటుంది. పైగా గత పర్యాయం వన్డే ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీని.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన పొట్టి ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. అయినా సరే టోర్నీకి హైప్ కనిపించడం లేదు. బహుశా ఇంత తక్కువ హైప్‌తో ఆసియా కప్ ఇప్పటిదాకా జరిగి ఉండకపోవచ్చు.

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు టికెట్లు పూర్తిగా అమ్ముడవలేదు. టోర్నీ ఏదైనా సరే. ఇండియా, పాకిస్థాన్ ఆడుతున్నాయంటే ఇలా టికెట్లు పెట్టడం ఆలస్యం అలా సోల్డ్ ఔట్ అయిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం మ్యాచ్ దగ్గర పడుతున్నా కూడా టికెట్ల అమ్మకం పూర్తి కాలేదట. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ పట్ల మన వాళ్లలో తీవ్ర వ్యతిరేక భావం ఏర్పడింది. అలాంటి టెర్రరిస్ట్ కంట్రీతో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలని జనం కోరుకుంటున్నారు.

క్రికెట్ విషయంలో రాజీ వద్దనుకుంటున్నారు. ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ తలపడబోతున్నట్లు తెలియగానే సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. లెజెండ్స్ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లను ఒకటికి రెండుసార్లు బహిష్కరించిన రిటైర్డ్ క్రికెటర్లకు గొప్ప మద్దతు లభించింది. బీసీసీఐ మాత్రం దీనికి భిన్నంగా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఇండియన్ టీం మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై నెటిజన్లు మండిపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ మ్యాచ్‌‌ల పట్ల అభిమానుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌లంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి చూసే సెలబ్రెటీలు, బిగ్ షాట్స్ సైతం.. జనాగ్రహాన్ని గ్రహించి ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లున్నారు. అందుకే ఈసారి ఈ మ్యాచ్ టికెట్లు అమ్ముడవని పరిస్థితి కనిపిస్తోంది.