ఆఫ్ఘాన్‌ భూకంపం.. ఇండియా నుంచి 21 టన్నుల సహాయం

ఆఫ్ఘాన్‌ భూకంపం మళ్లీ ప్రపంచాన్ని కదిలించింది. ఆదివారం రాత్రి 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం 1,400 మందికి పైగా ప్రాణాలు బలిగొనగా 3,000 మందికి పైగా గాయపడ్డారు. ఇళ్లన్నీ కూలిపోవడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ పరిస్థితిలో భారత్‌ సహాయ హస్తం చాపింది.

మంగళవారం ప్రత్యేకంగా సేకరించిన 21 టన్నుల సహాయ సామగ్రిని విమానాల ద్వారా కాబూల్‌కు పంపింది. ఈ సహాయ సరుకుల్లో దుప్పట్లు, టెంట్లు, హైజీన్‌ కిట్లు, నీటి ట్యాంకులు, జనరేటర్లు, మందులు ఉన్నాయి. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయం ప్రకటించారు. “భారత్‌ నుంచి ఆఫ్ఘాన్‌కు భూకంప సహాయం చేరింది” అని ఫోటోతో పంచుకున్నారు.

భూకంపం కేంద్రబిందువు నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లోని కామా జిల్లా. పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద ఉండటంతో ఆ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. మట్టి, చెక్కల ఇళ్లన్నీ కూలిపోవడంతో వందలాది మంది బీదరికంలో చిక్కుకుపోయారు. సహాయక చర్యల్లో కష్టాలు ఎదురవుతున్నాయి. హెలికాప్టర్లు ల్యాండ్‌ కావలేని ప్రాంతాల్లో తాలిబాన్‌ అధికారులు కమాండోలను ఎయిర్‌డ్రాప్‌ చేసి గాయపడిన వారిని తరలిస్తున్నారు.

ఇంతలో మంగళవారం మరోసారి 5.2 తీవ్రతతో మరో భూకంపం తూర్పు ఆఫ్ఘాన్‌ను కుదిపేసింది. ఇప్పటికే వందలాది గ్రామాలు మట్టిలో కలిసిపోగా, యునోచా (UNOCHA) అంచనాల ప్రకారం నాలుగు ప్రావిన్స్‌లలో 12,000 మందికి పైగా నేరుగా ప్రభావితులయ్యారు. సహాయక బృందాలు సమయానికి చేరుకోవడంలో భౌగోళిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి.

భారత ప్రభుత్వం ఇప్పటికే ఆఫ్ఘాన్‌కు ఆహార సహాయం పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు 21 టన్నుల అత్యవసర వస్తువులు చేరడంతో అక్కడి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని సహాయాలు అందించనున్నట్లు భారత్‌ స్పష్టం చేసింది. ఈ చర్య మళ్లీ భారత్‌ మానవత్వాన్ని చాటింది.