భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన డ్రీమ్ 11తో (Dream11) బీసీసీఐ ఒప్పందం రద్దయింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి గేమింగ్ కంపెనీలతో ఒప్పందాలు ఉండబోవని ఆయన ప్రకటించారు. దీంతో ఆసియా కప్ ప్రారంభానికి కొన్ని రోజులు ముందే స్పాన్సర్ ఖాళీ కావడం చర్చనీయాంశంగా మారింది.
బీసీసీఐ సన్నిహిత వర్గాల వివరణ ప్రకారం డ్రీమ్ 11 ప్రతినిధులు ఇప్పటికే స్పెషల్ గా బోర్డును సంప్రదించారు. కొత్త చట్టం కారణంగా ఒప్పందాన్ని కొనసాగించడం సాధ్యం కాదని స్వయంగా వారే తెలియజేశారు. 2023లో మూడు సంవత్సరాల కాలానికి రూ.358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నా ఇప్పుడు మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అయితే చట్టపరమైన కారణాలతో స్పాన్సర్షిప్ విరమించుకున్నందుకు ఎటువంటి జరిమానా విధించకూడదనే నిబంధన ఉన్నందున డ్రీమ్ 11కు పెనాల్టీ లేకుండా బయటకు వెళ్లే అవకాశం లభించింది.
ఈ పరిణామంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించనుంది. అంతేకాకుండా డ్రీమ్ 11 పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకూ స్పాన్సర్గా ఉండటం వల్ల వాటి ఒప్పందాలు కూడా రద్దు అయ్యే అవకాశముంది. దీంతో ఐపీఎల్ జట్లూ కొత్త స్పాన్సర్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించే పరిస్థితి రావచ్చు.
మరోవైపు డ్రీమ్ 11 మాతృసంస్థ ‘డ్రీమ్ స్పోర్ట్స్’ కొత్త రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఆర్థిక సేవల విభాగంలో ‘డ్రీమ్ మనీ’ పేరుతో కొత్త యాప్ను విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ యాప్ ట్రయల్ దశలో ఉంది. ఇందులో పసిడి కొనుగోలు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి సేవలు అందించనుందని సమాచారం. గూగుల్ ప్లే స్టోర్లో ఇప్పటికే ఈ యాప్పై వివరాలు లభిస్తున్నాయి. ఇక ఆసియా కప్తో ప్రారంభమయ్యే ఈ కొత్త దశలో బీసీసీఐ ఏ కంపెనీని స్పాన్సర్గా ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates