చేతివరకు వచ్చిన మ్యాచ్ ను చివరలో చేజార్చుకుంది టీమిండియా. చివరి నిమిషాల్లో ఒక్క చిన్న తప్పిదం ఓ టెస్టు మ్యాచ్ను ఎలా మార్చేస్తుందో లార్డ్స్ టెస్టు మరోసారి రుజువు చేసింది. ఐదు టెస్టుల సిరీస్లో ఇది మూడో మ్యాచ్. భారత్కు ఈ గేమ్ చాలా కీలకమైనది. కానీ జడేజా చివరలో పోరాటం చేసినా ఫలించలేదు. గెలుపు దగ్గరకి వచ్చి చేజార్చుకోవడం అందరికీ బాధ కలిగించింది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేయగా, భారత్ కూడా అదే నెంబర్ దగ్గర అలౌట్ అయ్యింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు భారత్ 58/4తో ఆట ప్రారంభించగా… చివరకు 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 22 పరుగుల తేడాతో ఓటమి చెందింది. భారత బ్యాటర్లలో జడేజా (61 నాటౌట్) ఒక్కడే నిలబడ్డాడు. మిగతా వారు డబుల్ డిజిట్కూ వెళ్లలేకపోయారు.
ఆఖరి రోజు తొలి సెషన్లోనే రాహుల్ (39), పంత్ (9), వాషింగ్టన్ (0) ఔట్ కావడంతో 82/7 అనే స్కోరుకు భారత్ కుదేలైంది. ఆ సమయంలో మ్యాచ్ భారత్ చేతుల నుండి వెళ్లినట్టే కనిపించింది. కానీ జడేజా, బుమ్రా కలిసి 35 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ను నిలబెట్టారు. బుమ్రా 5 పరుగులు చేసినా, 54 బంతులు ఆడుతూ ఇంగ్లాండ్కు ఒత్తిడి తెచ్చాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ (3/42), ఆర్చర్ (3/43), బ్రైడన్ కార్స్ (2/26), క్రిస్ వోక్స్, బషీర్ తలా ఒక్క వికెట్ తీశారు. చివరి వికెట్గా సిరాజ్ (4) ఔటవ్వడంతో మ్యాచ్ ముగిసింది. ఆ సమయంలో భారత్కు గెలవాలంటే ఇంకా 22 పరుగులు అవసరం. ఈ ఓటమితో సిరీస్ 2-1తో ఇంగ్లాండ్కు అనుకూలంగా మారింది. మిగిలిన రెండు టెస్టుల్లో భారత్ రెండూ గెలిస్తే తప్ప సిరీస్ దక్కదు. ఇక ఇంగ్లాండ్ ఒక్క గేమ్ గెలిచినా సిరీస్ వారి ఖాతాలోకే చేరుతుంది. ఇప్పుడు టీమ్ఇండియా మరింత ఆత్మవిశ్వాసంతో మిగిలిన రెండు మ్యాచుల్లో విజయం కోసం తపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates