5 స్టార్ హోటళ్లలో కుళ్లిన మాంసం..

ఇంటికంటే గుడి పదిలం అన్నది పాత సామెత. ఇంటి తిండి కంటే హోటల్ తిండే బెటర్ అనేది నేటి ట్రెండ్. ఉదయం టిఫిన్ నుంచి మొదలుకొని రాత్రి భోజనం వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లో ఒక్క ఆర్డర్ కొడితే చాలు క్షణాల్లో ఇంటి ముందు వాలిపోయే హోటల్ తిండికి చాలా మంది అలవాటు పడిపోయారు. ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు సరదాగా అలా బయటకు వెళ్లి హోటల్ తినడం సర్వ సాధారణమైపోయింది. అయితే నోరూరించే ఈ హోటల్ తిండి నాణ్యమైనది కాకపోయినా పర్వాలేదు కానీ కుళ్ళిపోయిన మాంసం, కూరగాయలతో చేసింది కావడం ఆందోళన కలిగిస్తుంది.

ఇటీవల బెంగళూరు బృహత్ మహానగర పాలిక (బీబీఎంపీ ) హోటళ్ళలో చేసిన తనిఖీల్లో కుళ్ళిపోయిన మాంసం, చేపలు, ఎక్స్ పైర్ అయిన పాలు దొరికాయి. రోడ్డు పక్కన వుండే ఆషామాషి హోటళ్ళలో ఇలాంటివి దొరికాయంటే అర్ధం చేసుకోవచ్చు.. బీబీఎంపీ తనిఖీలు చేసిన హోటళ్ళలో తాజ్, ర్యాడిసన్, వివంటా, ఫోర్ సీజన్స్, శాంగ్రీ-లా వంటి టాప్ స్టార్ హోటళ్ళు ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది. మొత్తం 26 త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్ళలో 30 టీములు తనిఖీలు చేసి 35 ఫుడ్ శాంపిల్స్ సేకరించాయి. ఈ శాంపిల్స్ ను టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపించారు. రిపోర్టు వచ్చాక తగిన చర్యలు తీసుకొంటామని బీబీఎంపీకి చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.

హోటళ్ళలోనే కాకుండా హోం డెలివరీ కంపెనీలకు చెందిన 236 యూనిట్లను తనిఖీలు చేశారు. ఇక్కడ 2,35,095 రూపాయల విలువ కలిగిన ఎక్స్పైర్ ఆహార పదార్ధాలను సీజ్ చేశారు. 65 మంది నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. వారిపై 44 కేసులు నమోదు చేశారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చాలా రకాల ఆహార పదార్ధాల మీద తప్పుడు ఎక్స్ పైర్ డేట్లు, లేబుల్స్ ఉండటం. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

బెంగళూరు మహా నగరంలోని బీబీఎంపీ పరిధిలో 1354 త్రీ స్టార్ హోటళ్ళు వున్నాయి. 58 ఫైవ్ స్టార్ హోటళ్ళు వున్నాయి. ఈవికాకుండా 5,550 టూ స్టార్, బడ్జెట్ హోటళ్ళు ఉండగా ఒక లక్ష ఈటరీలు, ఫుడ్ జాయింట్స్ వున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ డేటా ప్రకారం అంచనా. అయితే ఈ హోటళ్ళలో నాణ్యతాప్రమాణాలను పర్యవేక్షించేందు తగిన సంఖ్యలో ఫుడ్ సేఫ్టీ అధికారులు లేరు. లక్ష ఈటరీలకు కేవలం 6 మంది మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. దీంతో హోటల్ నిర్వాహకులు యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సిటీజన్లు ఆరోపిస్తున్నారు.