క‌రోనాకు ఏడాది.. ప్ర‌పంచ‌మే ఓడిపోయిందా?

క‌రోనా! ఈ మాట ఇంకా వినిపిస్తోంది. ఏరోజు కారోజు కొత్త‌గానూ ఉంది! కానీ, ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ జ‌నించి.. నేటికి ఏడాది పూర్త‌యింది. 2019, న‌వంబ‌రు 17న వూహాన్‌లో వెలుగు చూసిన ఈ వైర‌స్‌.. అత్యంత వేగంగా ప్ర‌పంచాన్ని చుట్టేసింది. కంటికి క‌నిపించ‌కుండా.. కుళ్ల‌బొడిచేసింది. అగ్ర రాజ్యం.. అథ‌మ రాజ్యం అన్న తేడా లేకుండా.. స‌ర్వ‌ప్ర‌జ స‌మాన‌త్వం.. స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వం.. విశ్వ‌స ‌మాన‌త్వం అనే మూడు సూత్రాల‌ను ఈ వైర‌స్ ఏకం చేసేసి.. విజృంభించి నేటికి ఏడాది పూర్త‌యింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌ల్లో ప్ర‌జ‌లు ఈ వైర‌స్ బారిన ప‌డి మృతి చెందారు.

అంతేకాదు.. ఈ ఏడాది కాలంలో క‌రోనా.. ప్రపంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. అగ్ర‌రాజ్యం అమెరికాలో ట్రంప్‌ ప్ర‌భుత్వాన్ని ప‌డేసిన కార‌ణాల్లో క‌రోనా కూడా ఒక‌టంటే.. ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ఇక‌, అమెరికాలో వ‌ర్షం ప‌డితే.. ప్ర‌పంచం తుమ్ముతున్నంత వేగ‌వంత‌మైన టెక్నాల‌జీ వ‌చ్చినా.. సుదీర తీరాల్లోని వ్య‌క్తులు ఆన్‌లైన్‌లో సెక‌న్ల వ్య‌వ‌ధిలో క‌లుసుకునే వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చినా.. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి మాత్రం ఈ సాంకేతిక ఏమీ ప‌నిచేయ‌లేక పోయింది. అంతేకాదు.. ఏడాది గ‌డిచినా.. నియంత్ర‌ణే త‌ప్ప‌.. నివార‌ణ లేని వైర‌స్‌గా.. స‌హ‌స్ర ముఖాల‌తో వైర‌స్ విజృంభిస్తోంది.

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ప్ర‌స్తుతం మూడో ద‌శ‌లో కూడా క‌రోనా ప్ర‌పంచాన్ని కాటేస్తోంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, క‌రోనా క‌ట్ట‌డికి అన్ని దేశాలు క‌లిసి.. ప‌నిచేస్తున్నా.. ఫ‌లిత‌మూ క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డం లేదు. వ్యాక్సిన్ తయారీకి వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తున్నా.. అదిగో .. వ్యాక్సిన్‌.. ఇదిగో వ్యాక్సిన్ అనిచెప్పుకోవ‌డానికే ప‌రిమిత‌మైంది.. త‌ప్ప‌.. ప్ర‌త్య‌క్షంగా అందుబాటులోకి ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. మ‌రో.. నాలుగు నెల‌ల వ‌ర‌కు వ‌చ్చే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ప్ర‌కృతిపై మ‌నిషి చేస్తున్న దాడులు.. అరాచకాల‌కు క‌రోనా ప్ర‌తిరూప‌మ‌ని… మేధావులు చెబుతున్నారు.

అన్ని విధాలా.. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నామని డ‌బ్బా కొట్టుకు‌నే దేశాలు కూడా క‌రోనా విష‌యంలో చేతులు ఎత్తేసిన నేప‌థ్యంలో మ‌న‌ముందున్న ప్ర‌ధాన క‌ర్త‌వ్యం.. ప్ర‌కృతిని ప‌రిమితంగా వినియోగించుకోవ‌డ‌మ‌న‌ని సూచిస్తున్నారు నిపుణులు. శాకాహారం దిశ‌గా అడుగులు ప‌డాల‌ని.. ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ‌కు చేయిచేయిక‌ల‌పాల‌ని సూచిస్తున్నారు. కానీ, ఇవేవీ మ‌న‌కు వినిపించ‌డం లేదు.. క‌నిపించ‌డ‌మూ లేదు. క‌ళ్ల‌ముందు అయిన వారు క‌రోనాతో చ‌నిపోతున్నా.. కాపాడుకోలేని దుర్భ‌ర‌స్థితికి కార‌కులం మ‌న‌మేన‌ని, మ‌న వికృత చేష్ట‌ల‌తో ప్ర‌కృతిని నాశ‌నం చేస్తున్నందునే క‌రోనా వంటి భ‌యంక‌ర వైర‌స్‌లు పుడుతున్నాయ‌ని మేధావులు చెబుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. క‌రోనా నేర్పిన పాఠంతో మ‌న‌ల్ని మ‌నం సంస్క‌రించుకుందామా? లేక‌.. చేతులు ఎత్తేద్దామా?!!