15 వేళ మందిని తొలగించిన మైక్రోసాఫ్ట్.. ఇది మరో హెచ్చరిక

ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయని చాలామందికి భయం. ఇప్పుడు అదే నిజం చేస్తూ మైక్రోసాఫ్ట్ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. కేవలం ఈ ఏడాదిలోనే 15 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించిన ఈ టెక్ దిగ్గజం… మిగిలిన ఉద్యోగులకు కూడా ఒక్క క్లియర్ సూచన ఇచ్చింది “AI లో నైపుణ్యం పెంచుకోండి, లేదంటే బయటకు వెళ్లండి.”

2025 నాటికి కంపెనీ ఏఐ కోసం 80 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. ఇదే క్రమంలో “మైక్రోసాఫ్ట్ ఎలెవేట్” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీని ద్వారా 5 ఏళ్లలో 2 కోట్ల మందికి ఏఐ శిక్షణ ఇవ్వాలన్నది వారి లక్ష్యం. ఈ మధ్యే మైక్రోసాఫ్ట్ గేమింగ్, ఎక్స్‌బాక్స్, సేల్స్ విభాగాల్లో దాదాపు 9 వేల మందిని తొలగించింది. మే నెలలో 6 వేల మందిని, జూన్‌లో మరో వందల మందిని ఉద్యోగాల నుంచి తప్పించింది.

కంపెనీకి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ఖర్చుల్ని తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ తీవ్రంగా చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో, ఏఐ పై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల, అందరూ దాని సామర్థ్యాన్ని వినియోగించాల్సిందేనని హెచ్చరిస్తోంది. డెవలపర్ డివిజన్ హెడ్ జూలియా లియుసన్ మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో, ఇకపై ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.

మైక్రోసాఫ్ట్ కోపిలాట్, అజూర్ ఏఐ, గిట్‌హబ్ కోపిలాట్ లాంటి టూల్స్ ఎలా ఉపయోగించాలో తెలిసేంతవరకూ ఉద్యోగంలో భద్రత ఉండదని హెచ్చరించారు. ఏఐ స్కిల్స్‌ను బట్టి ఉద్యోగుల్లో పనితీరు అంచనా వేస్తామని తెలియజేశారు. ఈ చర్యలతో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే 500 మిలియన్ డాలర్ల వరకు ఖర్చులు తగ్గించిందట. టెక్నాలజీ మారుతున్న వేగాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలంటే ఇప్పటినుంచే ఏఐపై దృష్టి పెట్టాల్సిందేననే సందేశాన్ని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది భారత్‌లోని ఐటీ ఉద్యోగులకు కూడా హెచ్చరికే కావచ్చు.