పిల్లల్ని చంపేసి ప్రియుడితో కలిసి లేచిపోయిన తల్లి.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య.. ప్రియుడి కోసం సొంత తల్లినే చంపేసిన కూతురు.. ఈ తరహా వార్తలు ఈ మధ్య తరచుగా వింటున్నాం. ఈ సమాజం ఎటు పోతోందో.. బంధాలు ఏమైపోతున్నాయో అని ఆందోళన రేకెత్తించే పరిణామాలివి. తాజాగా తెలంగాణలో గొప్ప పోరాట యోధురాలిగా పేరున్న చాకలి ఐలమ్మ ముని మనవరాలు.. తన కూతురి చేతిలోనే హత్యకు గురైన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
హైదరాబాద్లో కేవలం 16 ఏళ్ల వయసున్న కూతురు.. తన ప్రియుడు, అతడి తమ్ముడితో కలిసి తల్లి అంజలిని దారుణంగా హత్య చేయడం ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. తన అక్కే తల్లిని చంపిందంటూ.. ఆ హత్య జరిగిన తీరును కూడా చెల్లెలు మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. తన ప్రేమకు తల్లి ఒప్పుకోకపోవడం వల్లే ఆమె ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. మీడియాలో కూడా ఇదే రిపోర్ట్ అయింది.
ఐతే ఈ కేసును లోతుగా విచారించిన పోలీసులు కొత్త కోణాలను బయటికి తీశారు. బాలానగర్ డీఎస్పీ ఈ కేసు గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు. తల్లి వేధింపుల వల్లే కూతురు ఇలా చేసిందని ఆయన వెల్లడించడం గమనార్హం. నిందితురాలు అంజలికి సొంత కూతురు కాదట. తన భర్త మొదటి భార్యకు పుట్టిన అమ్మాయి అట. తన సొంత కూతురిని మాత్రం బాగా చూసుకుంటూ.. సవతి కూతురిని అంజలి నిర్లక్ష్యం చేసిందట.
తనను సవతి తల్లి చిత్ర హింసలు పెడుతోందన్న కారణంతో 7వ తరగతిలోనే బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసి కొన్ని రోజుల పాటు హోంలో ఉందట. ఇక వర్తమానంలోకి వస్తే శివ అనే అబ్బాయితో బాలిక ప్రేమ గురించి తెలిసిన అంజలి ముందు సరే అందట. అబ్బాయి, అమ్మాయి కొన్ని రోజులు వీళ్లింట్లోనే ఉంటూ సహజీవనం చేశారట. కానీ తర్వాత శివ నుంచి డబ్బులు డిమాండ్ చేయడం, బాలికను వేధించడంతో ఇద్దరూ కలిసి ఆమె హత్యకు ప్రణాళిక రచించారని.. శివ తమ్ముడు కూడా ఇందులో భాగం అయ్యారని.. ముగ్గురూ కలిసి ఆమెను హత్య చేశారని డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates