కన్నప్ప రిలీజ్: ఎన్ని వేల స్క్రీన్లో తెలుసా…

మంచు వారి కలల సినిమా ‘కన్నప్ప’ విడుదలకు సమయం దగ్గర పడింది. ఈ సినిమా ఆలోచన ఎప్పుడో పదిహేనేళ్ల ముందు మొదలైంది. అన్నీ కుదిరి అది సెట్స్ మీదికి వెళ్లడానికి చాలా టైం పట్టింది. మేకింగ్ ఆలస్యమై.. రిలీజ్ కూడా రెండుమూడుసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇది. 

మంచు విష్ణు గత చిత్రాలు ఘోరమైన ఫలితాన్ని అందుకున్నప్పటికీ.. తన మార్కెట్ బాగా డౌన్ అయిపోయినప్పటికీ.. ఈ కథ మీద ఉన్న నమ్మకం.. అలాగేప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్ర తారలు ఇందులో ప్రత్యేక పాత్రలు పోషించడంతో మంచు విష్ణు ధైర్యంగా ఇంత బడ్జెట్ పెట్టేశారు. ఇంత భారీ స్థాయిలో సినిమా తీయడమే కాదు.. రిలీజ్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. మంచు విష్ణు సినిమా అంటే మామూలుగా వెయ్యి థియేటర్లలో రిలీజైనా గొప్పే. 

అలాంటిది ‘కన్నప్ప’ను ఏకంగా 5400 థియేటర్లలో రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇంత భారీ రిలీజ్ భవిష్యత్తులో మరెప్పుడూ విష్ణు నుంచి ఉండకపోవచ్చు. టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజుల్లో ఇదొకటని చెప్పాలి. ఇండియాలో మాత్రమే 4 వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోంది. ఐమ్యాక్స్, 4 డీఎక్స్ వెర్షన్లలోనూ ‘కన్నప్ప’ను విడుదల చేస్తున్నారు. ప్రభాస్ ఇందులో చేసింది అతిథి పాత్రే అయినా.. తన ప్రెజెన్స్ సినిమా బిజినెస్‌కు, రిలీజ్‌కు బాగా ఉపయోగపడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు రీచ్ వచ్చిందంటే కారణం ప్రధానంగా ప్రభాసే. 

ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ద్వితీయార్ధంలో వస్తుంది. దాదాపు అరగంట నిడివితో ఆ పాత్ర ఉంటుంది. మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. శివుడిగా అక్షయ్ కుమార్‌కు చెప్పుకోదగ్గ స్క్రీన్ టైం ఉంటుందని సమాచారం. కాజల్ పార్వతీదేవిగా కనిపించనుంది. విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటించిన ఈ చిత్రాన్ని ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. స్టీఫెన్ డేవెస్సీ సంగీతం అందించాడు.