ఇప్పటివరకు 120 మృతదేహాలు మాత్రమే..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యను తెలియజేసే ప్రతి అప్‌డేట్ తీవ్రంగా కలిచివేస్తోంది. తాజాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుర్ఘటనలో మరణించిన వారిలో 162 మందికి సంబంధించిన డీఎన్ఏ నమూనాలు వారి కుటుంబ సభ్యుల డేటాతో సరిపోలినట్లు ధృవీకరించారు. ఇప్పటివరకు 120 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సమీపంలోని హాస్టల్ కాంప్లెక్స్‌పై కుప్పకూలింది. ఫ్లైట్‌లో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా.. వారిలో 241 మంది మరణించారు. విశ్వాస్ కుమార్ రమేశ్ అనే ఒక్క ప్రయాణికుడే ప్రాణాలతో బయటపడ్డాడు.

బీజే మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు లేవని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. ఆయన ప్రకారం.. ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ట్రామా వార్డులో ఉన్న అతను క్రమంగా కోలుకుంటున్నాడు.

ఈ ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం రాజ్‌కోట్‌లో రాష్ట్ర లాంఛనాలతో జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ వంటి నేతలు పాల్గొన్నారు. ఆయన కుమారుడు రుషభ్ రూపానీ చివరి కర్మ నిర్వహించాడు. ఈ సందర్భంలో వేదికపై ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది.

ఇక ప్రస్తుతం డీఎన్ఏతో గుర్తింపైన మిగిలిన మృతదేహాలను కుటుంబాలకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాల పట్ల అనేక నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉన్నందున.. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశముంది. కానీ ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా, సమగ్ర సమాచారం ఆధారంగా వదలే ప్రయత్నం జరుగుతోందని వైద్యశాఖ తెలిపింది.