సన్ రైజర్స్.. ఇక ‘ప్లే ఆఫ్’ ఛాన్స్ ఉన్నట్టా? లేనట్టా??

ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తుదిగా తలుపులు మూసుకుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకబడిన సన్‌రైజర్స్ ఈ ఓటమితో సీజన్ ప్రయాణాన్ని దాదాపు ముగించుకున్నట్లే

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. గిల్, బట్లర్, సుదర్శన్ లు సమిష్టిగా రాణించడంతో గుజరాత్ 224 పరుగులు చేసింది. కానీ ఆ లక్ష్యాన్ని చేధించడంలో సన్‌రైజర్స్ పూర్తిగా విఫలమైంది. ఒక్క అభిషేక్ శర్మ తప్ప మరెవరూ నిలకడగా ఆడలేకపోయారు. దీంతో మరో ఓటమి ఖాయం అయింది.

ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ల బౌలింగ్ ధాటికి సన్‌రైజర్స్ ర్యాన్లు చిత్తయ్యారు. చెత్త ఫీల్డింగ్, ప్లాన్ లేని బ్యాటింగ్ జట్టు ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. ఇదే సమయంలో ప్రత్యర్థి గుజరాత్ ఫీల్డింగ్, మైదాన వ్యవహారం మెరుగ్గా ఉండటం విజయానికి దోహదం చేసింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ క్యాచ్ మోమెంట్‌ను పూర్తిగా మార్చేసింది.

ఈ ఓటమితో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయట పడినట్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే చివరి నాలుగు మ్యాచ్‌లు గెలిచినా గరిష్టంగా 14 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్ ఆధారంగా మాత్రమే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం నెట్‌రన్‌రేట్ కూడా -1.192 ఉండటంతో అవకాశాలు లేకపోయినట్లే. టాప్ 4 లో MI – GT – RCB 14 పాయింట్స్ ఉండగా, 4వ స్థానంలో పంజాబ్ ఉంది. DC, LSG కూడా టాప్ లో ఉండేందుకు పోటీ పడుతోంది. దీంతో చివరి మూడు టీమ్ లలో ఏదో ఒకటి ఒక్క మ్యాచ్ గెలిచినా సన్ రైజర్స్ అఫీషియల్ గా ఇంటికే. 

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలో మంచి ఆరంభం చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మిడిల్ స్టేజ్ నుంచి పూర్తిగా నిలదొక్కుకోలేకపోయింది. స్టార్ ఆటగాళ్లున్నా, ఫామ్ లో లేకపోవడం, బ్యాటింగ్-బౌలింగ్ సమన్వయం లేకపోవడంతో ఈ స్థితికి చేరుకుంది. ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌లు గౌరవ పరంగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంది.