ఐపీఎల్‌లో ఢిల్లీ.. వన్ అండ్ ఓన్లీ

ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా సాగుతోందో తెలిసిందే. లీగ్ దశలో చివరి మ్యాచ్ వరకు ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కాకపోవడం విశేషమే. లీగ్ దశ చివరి రెండు మ్యాచ్‌లకు ముందు వరకు కూడా ఖరారైన ప్లేఆఫ్ బెర్తు ఒక్కటే. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌తో ఒకేసారి రెండు బెర్తులు తేలిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్లకు ప్లేఆఫ్‌లో అదనపు అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. మొదట జరిగే క్వాలిఫయర్‌లో ఓడినా మళ్లీ ఎలిమినేటర్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇది టాప్-2లో ఉన్న ముంబయి, ఢిల్లీ జట్లకు కలిసొచ్చే అంశం.

ఇక ఢిల్లీ చేతిలో ఓడినప్పటికీ.. నెట్ రన్‌రేట్‌లో మెరుగైన స్థితిలోనే ఉండటంతో బెంగళూరు కూడా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఢిల్లీ 17.3 ఓవర్లలోపు ఛేదించి ఉంటే బెంగళూరు రన్‌రేట్.. కోల్‌కతా కంటే కిందికి వెళ్లేది. అప్పుడు కోల్‌కతా ముందంజ వేసేది. అప్పుడు మంగళవారం ముంబయి చేతిలో సన్‌రైజర్స్ ఓటమి కోసం బెంగళూరు ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు బెంగళూరుకు ముందుకెళ్లిపోవడంతో కోల్‌కతా ఆ స్థితిలో ఉంది. మరి సన్‌రైజర్స్ గెలిచి ముందంజ వేస్తుందా.. లేక ఓడి కోల్‌కతాకు అవకాశమిస్తుందా అన్నది చూడాలి.

ఇదిలా ఉంటే తాజా ఫలితంతో ఢిల్లీ ఐపీఎల్‌లో ఒక అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో మొత్తం 13 సీజన్లు జరిగితే 2012లో పది జట్లు పోటీ పడ్డాయి. తర్వాతి రెండు సీజన్లలో తొమ్మిదేసి జట్లు ఆడాయి. మిగతా సీజన్లన్నింటిలో జట్ల సంఖ్య ఎనిమిదే. ఐతే ఢిల్లీ ఇప్పటిదాకా లీగ్ దశలో టాప్-1 నుంచి టాప్-10 వరకు ప్రతి స్థానంలోనూ నిలవడం విశేషం. 2009, 2012 సీజన్లలో ఢిల్లీ అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ప్రస్తుత సీజన్లో రెండో స్థానంలో నిలిచింది. 2019, 2008, 2009 సీజన్లలో వరుసగా 3, 4, 5 స్థానాలు సాధించింది. 2016, 17 సీజన్లలో ఆరో స్థానంలో నిలిచింది. 2017లో ఏడో స్థానానికి పరిమితమైంది. 2014, 18 సీజన్లలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 2013, 2011 సీజన్లలో వరుసగా 9, 10 స్థానాల్లో నిలిచింది. లీగ్‌లో ఎనిమిది జట్లే కొనసాగితే ఈ రికార్డు మరే జట్టూ అందుకోలేదు.