ఐపీఎల్: 14 ఏళ్ళ వైభవ్.. ఆరంభం అదిరింది!

ఐపీఎల్ 2025లో అద్భుతమైన ఘట్టం నమోదైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగిన బీహార్ టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి తన మొదటి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో 1.1కోట్లకు రాజస్థాన్ వేలంలో దక్కించుకుంది. ఇక ఆ కుర్రాడు మొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడతాడా అని అంతా ఎదురు చూడగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓపెనింగ్ లో వచ్చాడు. 

అయితే ఊహించని విధంగా మొదటి బంతికే సిక్స్ కొట్టి గ్రౌండ్‌లో విజిల్స్ వేయించాడు. సీనియర్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన స్వింగ్ బంతిని కాస్త వెనక్కి వెళ్లి కవర్స్ మీదుగా భారీ షాట్‌తో గాల్లోకి పంపాడు వైభవ్. ఈ సిక్స్‌తో కేవలం అతని ఆటగాడిగానే కాదు, ధైర్యంగా ఆడే కుర్రాడిగా తన మార్క్‌ను కూడా చాటాడు. ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.

వైభవ్ మొత్తం 20 బంతులు ఆడి 34 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. మార్‌క్రమ్ వేసిన బంతిని షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన సమయంలో కీపర్ రిషబ్ పంత్‌కి స్టంప్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత పెవిలియన్ వెళుతూ వైభవ్ కంటతడి పెట్టిన తీరు ప్రేక్షకుల గుండెల్ని తాకింది. రాజస్థాన్ బౌలింగ్ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలో యశస్వి జైస్వాల్ (74), రియాన్ పరాగ్ (39) మద్దతు ఇచ్చినా, చివర్లో లఖ్‌నవూ బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుత బౌలింగ్ చేసి ఆ జట్టును 2 పరుగుల తేడాతో గెలిపించాడు.

లఖ్‌నవూ తొలుత 180 పరుగులు చేయగా, రాజస్థాన్ 178 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. కానీ ఈ మ్యాచ్‌లో  వార్తల్లో నిలిచిన పేరు మాత్రం వైభవ్ సూర్యవంశినే. కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు పలువురు క్రికెట్ లెజెండ్స్ అతని ఆటతీరును ప్రశంసిస్తున్నారు. ఒకవేళ అతను ఈ ఊపును కొనసాగిస్తే, భారత క్రికెట్‌కు మరొక యువ అద్భుతం సిద్ధంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెక్స్ట్ అతను వచ్చే గురువారం RCB తో జరిగే మ్యాచ్ లో చోటు దక్కించుకోవడం పక్కా అని తెలుస్తోంది.