ఐటీలో మరో బిగ్ షాక్.. ఒకేసారి 240 మందిని తొలగించిన ఇన్ఫోసిస్

గూగుల్ నుంచి స్టార్ట్ అప్ కంపెనీ వరకు.. ఐటీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు భయపడుతూ పని చేసే పరిస్థితి వచ్చింది. జాబ్ లో నుంచి ఎప్పుడూ తీసేస్తారో తెలియని కష్టకాలం నెలకొంది. ఇక ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి ఉద్యోగుల తొలగింపులతో వార్తల్లోకెక్కింది. శిక్షణలో ఉన్న 240 మంది ట్రైనీలను ఒకేసారి ఉద్యోగం నుంచి తొలగించడంపై ఇప్పుడు ఐటీ రంగంలో పెద్ద చర్చే జరుగుతోంది. 

శిక్షణ కాలంలో నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో కనీస ప్రమాణాలు చేరుకోలేదన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఏప్రిల్ 18న ఈ ట్రైనీలకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించగా, “మాకు మీరు ఫౌండేషన్ ట్రైనింగ్‌లో అర్హత సాధించలేకపోయారు. అదనంగా శిక్షణ, సందేహ నివృత్తి సెషన్లు, మూడు ఛాన్సులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. కాబట్టి అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కొనసాగించలేము” అని మెయిల్‌లో పేర్కొంది. 

ఇదే ఏడాది ఫిబ్రవరిలో 300 మందికి పైగా ట్రైనీలను ఇలాగే తొలగించిన సంగతి తెలిసిందే. అయితే సంస్థ పూర్తిగా చేతులెత్తేసినట్లు మాత్రం లేదు. ఉద్యోగం కోల్పోయిన ట్రైనీలకు మానవీయంగా సహాయం చేయాలని నిర్ణయించింది. వీరికి ఒక నెల వేతనాన్ని ఎక్స్‌గ్రేషియా రూపంలో చెల్లించనుంది. అదేవిధంగా NIIT, UpGrad సంస్థల ద్వారా ఉచితంగా స్కిల్స్ అభివృద్ధి శిక్షణను అందించనుంది. రిలీవింగ్ లెటర్, ఉద్యోగాన్వేషణకు అవసరమైన ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.

శిక్షణ పూర్తి చేసినవారు భవిష్యత్‌లో ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్‌లో ఉండే అవకాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే ఐటీ కెరీర్ కొనసాగించాలనుకునే వారికి బాహ్య శిక్షణా అవకాశాలను ఇన్ఫోసిస్ ప్రాయోజించనుంది. మైసూర్ శిక్షణ కేంద్రం నుంచి బెంగళూరుకు ట్రావెలింగ్ అలవెన్స్, అవసరమైతే వసతి, కౌన్సెలింగ్ సేవలు కూడా అందిస్తామని సంస్థ వెల్లడించింది.

కొందరు ట్రైనీలు ఈ శిక్షణకు రాబడానికి రెండు సంవత్సరాలుగా వేచి ఉన్నారని, ఇలాంటి సమయంలో ఒకేసారి తొలగింపులు జరగడం దురదృష్టకరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, ప్రాజెక్టులపై ఖర్చుల కోతల నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు మరికొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.