అమెరికాలో గురువారం రాత్రి ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 153 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఓ విమానాన్ని ఓ చిన్న కుందేలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గురయ్యేలా చేసింది. అయితే ఈ ఘటనలో ఏ ఒక్క ప్రయాణికుడికి కూడా ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డెన్వర్ నుంచి ఎడ్మింటన్ కు బయలుదేరిన ఈ విమానం కుందేలు కారణంగా వెనక్కు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత ప్రయాణికులను వేరే విమానంలో ఎడ్మింటన్ కు పంపారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం డెన్వర్ నుంచి ప్రయాణికుతో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎడ్మింటన్ ను బయలుదేరింది. అయితే డెన్వర్ నుంచి గాల్లోకి ఎగిరిన విమానంలోని కుడి రెక్కలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు చూస్తుండగానే మిన్నంటాయి. టేకాఫ్ అయిన వెంటనే విమానం రెక్కలో చెలరేగిన మంటలను చూసి ప్రయాణికులు హాహాకారాలు చేయగా… పైలట్లు వేగంగా స్పందించి విమానాన్ని డెన్వర్ ఎయిర్ పోర్టుకు మళ్లించి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా క్షేమంగా విమానం దిగారు.
ఆ తర్వాత అసలు విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలేమిటన్న విషయాన్ని కనుగొనేందుకు సోదాలు చేయగా… విమానం రెక్కలో ఓ చిన్న కుందేలు కనిపించింది. ఈ కుందేలు కారణంగానే విమానం రెక్కలో మంటలు చెలరేగినట్లు సమాచారం. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో విమానంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చిందని…ఆ సమయంలోనే కుందేలు విమానం రెక్కలోకి వెళ్లి ఉంటుందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. అసలు విమానంలోకి ఆ కుందేలు ఎలా వచ్చిందన్నది మాత్రం ఇంకా తేలలేదు. విమానం గాల్లో ఉండగా… చెలరేగిన మంటలను విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టగా.. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates