చాట్ GPT – డీప్ సీక్ – మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి అలవాటు పడుతోంది. ముఖ్యంగా చైనా ఏఐ పరిశోధకులు ప్రపంచానికి సాంకేతిక విజ్ఞానంలో ఒక సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చే మార్గం వేస్తున్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర ఒత్తిడిలో కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు సంవత్సరాల్లో చైనాకు చెందిన పలువురు ప్రముఖ ఏఐ శాస్త్రవేత్తలు చిన్న వయసులోనే మరణించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
అనారోగ్యంతో చనిపోయారని అధికారికంగా చెబుతున్నా… మానసిక ఒత్తిడే ప్రధాన కారణమా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. డేటా ప్రకారం, 2022 నుండి 2025 మధ్య కాలంలో కనీసం ఆరుగురు ప్రముఖ ఏఐ నిపుణులు మరణించారు. వీరిలో మెగ్వీ టెక్నాలజీకి చీఫ్ సైంటిస్టుగా పనిచేసిన మైక్రోసాఫ్ట్ మాజీ పరిశోధకుడు సన్ జియాన్ (45), చైనా రక్షణ రంగ ఏఐ నిపుణుడు ఫెంగ్ యాంగే (38), సెన్స్టైమ్ సంస్థ వ్యవస్థాపకుడు టాంగ్ జియావో (55), హెల్త్కేర్ ఏఐ సంస్థలో సీనియర్ ఇన్నోవేటర్ హే జీ (41), టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వాన్ యుహున్ (39) వంటి వారు ఉన్నారు.
వీరిలో చాలామంది అమెరికాలో విద్యనభ్యసించి, అనుభవం సంపాదించి, స్వదేశానికి తిరిగొచ్చినవారే. ఇక్కడ ప్రశ్నేంటంటే… ప్రపంచస్థాయిలో ప్రతిభావంతులైన ఈ శాస్త్రవేత్తలు చిన్న వయసులోనే ఎందుకు మరణించారన్నది. చైనా లోపలి వర్గాల సమాచారం ప్రకారం, రీసెర్చ్ రంగంలో ఉండే ఒత్తిడికి, నిరంతర స్పర్థకు వారు లోబడి ఉంటారని అంటున్నారు. ఒక ఐడియాతో వచ్చేసరికి, అదే అంశాన్ని ఇంకొకరు మునుపే పూర్తిచేసేస్తే మనోభావాలు దెబ్బతింటాయని, అది తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తుందంటున్నారు నిపుణులు.
అంతేగాక, ఏఐ రంగంలో తలెత్తే నైతిక వివాదాలు, ఆ టెక్నాలజీ వల్ల సమాజంపై పడే ప్రభావాలు కూడా ఈ శాస్త్రవేత్తలపై అణిచివేతలా మారుతున్నాయట. కొన్ని కంపెనీలు మరియు ప్రభుత్వాలు వేగంగా ఫలితాల కోసం ఒత్తిడి తీసుకురావడం, పనిలో సంతృప్తికంటే లక్ష్యాల అమలు మాత్రమే ప్రాధాన్యం కావడం వల్ల జీవితం మీదే ప్రశ్నార్థకం పడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, కేవలం టెక్నాలజీ పురోగతిపై కాకుండా… శాస్త్రవేత్తల మానసిక ఆరోగ్యంపై కూడా గమనించాల్సిన అవసరం వుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates