ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలి మ్యాచ్లో విజయంతో సీజన్లో శుభారంభం చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత గెలుపు ముఖమే చూడలేదు. వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో కింద ఉంటోంది. రోహిత్ శర్మ స్థానంలో గత ఏడాది కెప్టెన్గా నియమితుడై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య.. జట్టును సరిగా నడిపించలేకపోయాడు.
ఈ సీజన్లో ఆ గొడవ సద్దుమణగడంతో ముంబయి గాడిన పడుతుందని అంతా అనుకున్నారు. కానీ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన చేస్తోంది. హార్దిక్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతున్నప్పటికీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోతున్నాడు. హార్దిక్ కెప్టెన్సీ బాగా లేకపోవడం వల్లే ముంబయి రాణించలేకపోతోందనే విమర్శలు తప్పట్లేదు.
ఈ తరహా విమర్శలు చేసేవాళ్లకు తెలుగు స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు దీటైన బదులిచ్చాడు. ఒక చర్చా కార్యక్రమంలో టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, మాజీ కోచ్ సంజయ్ బంగర్.. హార్దిక్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తుండడంతో హార్దిక్కు కెప్టెన్సీ పరంగా సరైన సలహాలు ఇచ్చేవారు కరవయ్యారని బంగర్ వ్యాఖ్యానించగా.. ఈ కామెంట్స్తో రాయుడు తీవ్రంగా విభేదించాడు. ఒక కెప్టెన్కు పక్కనుండి ఎవరూ చెవిలో చెబుతూ ఉండాల్సిన అవసరం లేదని రాయుడు అన్నాడు. గత సీజన్లో ఇలా చేసే అతణ్ని ఇబ్బంది పెట్టారన్నాడు.
రోహిత్ గొప్ప కెప్టెన్ అనడంలో సందేహం లేదని.. కానీ ఇప్పుడు ముంబయి హార్దిక్ జట్టని అతనన్నాడు. రోహిత్ కెప్టెన్గా ఉండగా ఎవరైనా సలహాలు ఇచ్చారా, అలా ఇస్తే బాగుండేదా అని అతను ప్రశ్నించాడు. మధ్యలో బంగర్ జోక్యం చేసుకుని రోహిత్ ఐదుసార్లు కప్పు గెలిచాడని, నీకు కెప్టెన్గా అనుభవం లేదు కాబట్టి ఈ విషయాలు తెలియవని కామెంట్ చేయగా.. రోహిత్ ఇప్పుడు కెప్టెన్ కాదు, సారథిగా తన శకం ముగిసిందని రాయుడు తేల్చేశాడు.