సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపించిన బ్రిటన్

తగ్గినట్లే తగ్గి.. అసలు వడ్డీతో సహా అన్నట్లుగా వ్యవహరించే ధోరణి కరోనా మహమ్మారి సొంతం. తొలిదశలో నెమ్మదిగా మొదలయ్యే వైరస్ సంక్రమణం.. పీక్స్ కు వెళ్లటం.. తర్వాత మళ్లీ తగ్గుముఖం పట్టటం తెలిసిందే. ఈ సందర్భంలో చాలామంది చేసే నిర్లక్ష్యం.. ఉన్నట్లుండి పేలే అగ్నిపర్వతాన్ని పోలి ఉంటుంది. సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని తాజాగా బ్రిటన్ ను చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు. కొంతకాలం క్రితం కరోనా అదుపులోకి రావటం.. ఆ దేశంలో పలు కార్యకలాపాల్ని యథావిధిగా నిర్వహించటం తెలిసిందే.

కొద్దిరోజులుగా సెకండ్ వేవ్ షురూ అయ్యింది. ఇదెంత తీవ్రంగా ఉందంటే.. రోజుకు లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు.. రానున్న తొమ్మిది రోజుల్లో ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు డబుల్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం అక్టోబరు 16-25 మధ్యన దేశ వ్యాప్తంగా 85 వేల మందిలో నమూనాలు సేకరించారు. ప్రతి పదివేల మందిలో 128 మందికి కోవిడ్ ఉన్నట్లుగా తేలింది. అక్టోబరు మొదటివారంలో ఈ సంఖ్య కేవలం 60 మాత్రమే కావటం గమనార్హం.

సెకండ్ వేవ్ లో పెద్ద వయస్కుల మరణాలు.. గతం కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 55-65 మధ్య వయస్కుల్లో కోవిడ్ సోకిన వారి మరణాలు మూడు రెట్లు పెరిగినట్లుగా చెబుతున్నారు. బ్రిటన్ లోనే కాదు.. అమెరికాతో పాటు పలు యూరోపియన్ దేశాల్లోనూ కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా సాగుతోంది. దీని ధాటికి నిలువలేక.. కేసుల నమోదు తగ్గించేందుకు వీలుగా ప్రాన్స్ లో తాజాగామరోసారి లాక్ డౌన్ విధించారు. తాజాగా విధించిన లాక్ డౌన్ అక్టోబరు 30 నుంచి డిసెంబరు 1 వరకు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్ అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. కోవిడ్ టెస్టును తేల్చేందుకు కొత్త విధానాల్ని తీసుకొస్తున్నారు.

సింగపూర్ కు చెందిన ఒక కంపెనీ తాజాగా తీసుకొచ్చిన విధానం ప్రకారం నిమిషం వ్యవధిలోనే కరోనా టెస్టు పలితాల్ని తేల్చేయనుంది. మన దగ్గర అందుబాటులో ఉన్న విధానాల్లో చూస్తే.. ఆర్టీపీసీఎస్ పరీక్ష ఫలితం రావటానికి రోజు సమయం పడితే..యాంటీజెన్ కోసం గంట నుంచి మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే.. సింగపూర్ కు చెందిన బ్రీతోనిక్స్ అనే సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన విధానం ప్రకారం ఒక్కంటే ఒక్క నిమిషంలోనే కరోనా టెస్టు ఫలితాన్ని తేల్చేయనుంది. ఈ పరీక్షా విధానంలో బ్రీతలైజర్ లాంటి పరికరాల్ని ఉపయోగిస్తారు. దీని కచ్ఛితత్త్వం 90 శాతంగా చెబుతున్నారు. నెగెటివ్ లనుగుర్తించటంలో 95 శాతం కచ్చితత్త్వం ఉన్నట్లుగా తేలింది. సెకండ్ వేవ్ భారత్ లో విరుచుకుపడే నాటికి.. ఈ తరహా పరీక్షా విధానాన్ని దేశంలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.