అవును.. ఈ కుక్క ఖరీదు రూ.50 కోట్లు

బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కుక్క పేరు కడాబాంబ్ ఒకామి (Cadabomb Okami) కాగా, ఇది వోల్ఫ్ ప్లస్ కాకెషియన్ షెపర్డ్ కలయికతో రూపొందిన అరుదైన జాతికి చెందినదిగా గుర్తించారు.

అమెరికాలో జన్మించిన ఈ కుక్క ప్రస్తుతం 8 నెలల వయస్సులో 5 కిలోల బరువును కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది రోజుకు 3 కిలోల మాంసం తింటుందని సమాచారం. ఎస్. సతీష్ ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. పెంపుడు జంతువులపై అతనికి అపారమైన ఆసక్తి ఉంది. ఇప్పటివరకు 150కి పైగా వివిధ జాతుల కుక్కలను పెంచుతున్నారు. ఈ ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను ఆయన ఫిబ్రవరిలో కొనుగోలు చేశారు.

కేవలం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా 7 ఎకరాల స్థలంలో ఆధునిక సదుపాయాలతో డాగ్‌ ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి కుక్కకు 20×20 అడుగుల గదిని కేటాయించి, వాటి రక్షణ కోసం ప్రత్యేకంగా 6 మంది సిబ్బందిని నియమించారు. ఈ అరుదైన జాతుల కుక్కలను ప్రదర్శించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకంగా ఈ కుక్కలను చూసేందుకు సతీష్ దగ్గరకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. 30 నిమిషాల ప్రదర్శనకు రూ.2.5 లక్షలు, 5 గంటల పాటు ప్రదర్శనకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో కూడా సతీష్ రూ.27 కోట్లకు చౌ చౌ జాతి కుక్కను కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు.