డీప్‌సీక్ దెబ్బకు మస్క్, మార్క్ ల ఆస్తులు ఆవిరి

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో చైనా కంపెనీ డీప్‌సీక్ (DeepSeek) సంచలనంగా మారింది. ఈ కంపెనీ తీసుకొచ్చిన ఉచిత ఏఐ మోడల్ కారణంగా అమెరికా టెక్ దిగ్గజాలకు భారీ నష్టం తప్పలేదు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ , అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బీజోస్.. లాంటి ప్రపంచ కుబేరులు కేవలం నెలరోజుల్లోనే తమ సంపదలో లక్షల కోట్లు కోల్పోయారు.

ఫిబ్రవరి నెల మొదట్లోనే మస్క్ సంపద 433 బిలియన్ డాలర్లుగా ఉండగా.. నెలాఖరుకు 349 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే అతను దాదాపు 90 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాడు. అంటే ఇండియన్ కరెన్సీలో 7.9 లక్షల కోట్లు. అదే విధంగా ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ సంపద 20 బిలియన్ డాలర్లు తగ్గగా, జుకర్‌బర్గ్ 11 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాడు. ఒరాకిల్ ఛైర్మన్ ల్యారీ ఎలిసన్ 27.6 బిలియన్ డాలర్ల నష్టంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలోనుంచి ఐదో స్థానానికి పడిపోయాడు.

ఈ పరిణామాలకు ప్రధాన కారణం డీప్‌సీక్ తీసుకొచ్చిన ఉచిత ఏఐ మోడల్ అని నిపుణులు చెబుతున్నారు. 2023లో లియాంగ్ వెన్‌ఫెంగ్ స్థాపించిన హాంగ్‌జౌకు చెందిన ఈ కంపెనీ, ఇటీవల ఆర్1 పేరిట ఓ అత్యాధునిక ఏఐ మోడల్‌ను విడుదల చేసింది. ఇది పూర్తిగా ఉచితంగా అందించడంతో, ఓపెన్ఏఐ, క్లాడ్‌ సోనెట్‌ వంటి సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఏఐ సేవలను ఉపయోగిస్తున్న యూజర్లు మళ్లీ ఆలోచించేలా చేసింది.

డీప్‌సీక్ తాజా ప్రవేశంతో, అమెరికా టెక్ కంపెనీల స్టాక్ మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. ఎన్విడియా మార్కెట్ క్యాప్ ఏకంగా 600 బిలియన్ డాలర్ల మేర నష్టపోగా, మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, టెస్లా లాంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ పరిణామం అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఓ కంపెనీ ఇంత తక్కువ సమయంలో ఇంత నష్టపోవడం ఇదే తొలిసారి.

ఈ నేపథ్యంలో, టెక్ దిగ్గజాలు డీప్‌సీక్‌ ప్రభావాన్ని ఎదుర్కొనే మార్గాలు అన్వేషిస్తున్నాయి. అమెరికా కంపెనీలు తమ ఏఐ మోడళ్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నాయి. కానీ ఉచిత ఏఐ మోడల్‌ను తీసుకువచ్చిన డీప్‌సీక్‌.. భవిష్యత్ టెక్ ప్రపంచంపై ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి.