జీవీ రెడ్డికి చంద్రబాబు క్లాస్? : అసలేం జరిగిందంటే…!

జీవీ రెడ్డి. గ‌త నాలుగు రోజులుగా ఏపీ మీడియాలో ప్ర‌ముఖంగా వినిపించిన పేరు. తెలుగు దేశం పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న స‌మ‌యంలో వైసీపీని ఎండ‌గ‌ట్టి.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు రెడ్డి కొంత మేర‌కు కృషి చేశారు. అదేస‌మ‌యంలో ఆయ‌న చ‌ర్చ‌లు, ఇష్టాగోష్టుల పేరుతో కూడా టీడీపీకి మేలు చేశారు. దీంతో కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న కృషిని గుర్తించిన చంద్ర‌బాబు.. ఏకంగా కీల‌క‌మైన ఏపీ ఫైబ‌ర్ నెట్‌.. చైర్మ‌న్ గిరీ అప్ప‌గించారు.

అయితే.. ఈ ప‌ద‌విని చేప‌ట్టిమూడు మాసాలు కూడా కాకుండానే.. రెడ్డిగారు వివాదాల‌కు కేంద్రంగా మారిపో యారు. ఉన్న‌త విద్యావంతుడు, మేధావి అనే కార‌ణంగా చంద్ర‌బాబు ఆయ‌న‌కు ప‌ద‌వి ఇస్తే.. స‌ర్కారునే రోడ్డున ప‌డేలా వ్య‌వ‌హ‌రించడం .. కూట‌మిని కుదిపేసింది. ఫైబ‌ర్ నెట్ ఎండీ దినేష్‌కుమార్‌పై బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ద్రోహానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. దీంతో ఐఏఎస్ సంఘం తీవ్రంగా ఆక్షేపించింది. పైగా సీఎం చంద్ర‌బాబుకు కూడా.. ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన చంద్ర‌బాబు రెడ్డిగారిని మంద‌లించారు. నువ్వు ఎంత మేధావి అయినా.. పనిలో చూపించాల‌ని.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున ప‌డేసేలా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా? అని క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు.. ప్ర‌తి వ్య‌వ‌స్థ‌లోనూ కొన్ని లోపాలు ఉంటాయ‌ని.. అలాగ‌ని క‌డుపు చించుకుంటామా? అని కూడా చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఇక నుంచి ఏదైనా లోపాలు ఉంటే మీడియా ముందు కాకుండా.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చించాల‌ని కూడా చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

మ‌రీ ముఖ్యంగా కూట‌మి స‌ర్కారు వ‌చ్చి 9 నెల‌లు అయినా.. ఒక్క క‌నెక్ష‌న్ ఇవ్వ‌లేద‌ని.. వైసీపీ హ‌యాంలో ఇచ్చిన క‌నెక్ష‌న్లే ఉన్నాయ‌ని, ఒక్క‌రూపాయి కూడా ఆదాయం రాలేద‌ని.. వైసీపీ హ‌యాంలో ల‌క్ష‌ల రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింద‌న్న రెడ్డిగారి వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు ఆక్షేపించారు. ఇలా చేయ‌డం ద్వారా.. వైసీపీకి మేలు చేస్తున్నారా? అని సూటిగా ప్ర‌శ్నించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఎంత నిక్క‌చ్చి అయినా కొంత త‌గ్గాల్సిందేన‌ని.. లేనిపోని ఆరోప‌ణ‌ల‌తో ప‌రువు తీయొద్ద‌ని జీవీ రెడ్డికి చంద్ర‌బాబు క్లాస్ తీసుకున్నారు. మ‌రి ఆయ‌న త‌గ్గుతారో.. లేదో చూడాలి.