పవన్ వెళ్ళిన ప్రతిచోటా ‘OG’ ప్రకంపనలు

నిన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన తమన్ మ్యూజికల్ కన్సర్ట్ బ్లాక్ బస్టర్ సక్సెసయ్యింది. ఎన్నో పాటలతో తమన్ అదరగొట్టేశాడు. అయితే ఓజి టీజర్ లో వినిపించిన థీమ్ సాంగ్ ని ప్రత్యక్షంగా వేదిక మీద ప్లే చేస్తున్నప్పుడు గ్రౌండ్ లో ఉన్న యుఫోరియా వేరే స్థాయికి వెళ్ళిపోయింది.

వేలల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు సందర్భం దొరికిన ప్రతిసారి ఓజి ఓజి అంటూ మైదానాన్ని హోరెత్తించడం రాజకీయ నాయకులను ఆశ్చర్యపరిచిందేమో కానీ దీని జ్వరం గురించి ముందే తెలిసిన ప్రేక్షకులను కాదు.

ఆ మధ్య ఒక ఆసుపత్రికి పవన్ వెళ్ళినప్పుడు కొందరు ఫ్యాన్స్ ఓజి ఓజి అంటూ అరిచి ఆయన కోపానికి గురి కావడం చూశాం. ఇది తగ్గాలంటే వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ ప్రకటించడం తప్ప వేరే మార్గం లేదు. అయితే దీనికన్నా ముందు హరిహర వీరమల్లు రావాలి. మార్చ్ 28 విడుదలలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ చెబుతూనే ఉన్నారు.

వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో డివివి సంస్థ ఓజికి ఎక్కువ పబ్లిసిటీ చేయడం లేదు. లేకపోతే నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు లేదా ట్వీట్ తో హడావిడి కనిపించేది. అదంతా ఆగింది.

ముందు వీరమల్లు ఈ నెలలోనే పూర్తి చేసి ఇకపై డేట్లు ఓజికి ఇచ్చేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. దర్శకుడు సుజిత్ దాని కోసమే ఎదురు చూస్తున్నాడు. 2025లోనే వస్తుందా అనే అనుమానమే. ఎందుకంటే డిప్యూటీ సిఎంగా పాలనలో బిజీ అయిన పవన్ కు కొత్త కమిట్ మెంట్లు ఇచ్చేంత సమయం లేదు.

ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ డెబ్భై శాతానికి పైగానే బ్యాలన్స్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని కూటమి పాలనలో కీలక భూమిక పోషించాలని నిర్ణయించుకున్నట్టు అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఓజి రెండు భాగాలుగా రావొచ్చనే ప్రచారం ఉంది కానీ టీమ్ కన్ఫర్మ్ చేయడం లేదు.