ఇండియన్స్ కు మరో షాక్.. అమెరికా స్టైల్ లొనే బ్రిటన్..

అక్రమ వలసదారుల నియంత్రణకు ఇటీవల పలు దేశాల తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీసెంట్ గా అమెరికా అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయగా ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.

ఇటీవల ‘యూకే వైడ్ బ్లిట్జ్’ పేరుతో వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న భారతీయ రెస్టారెంట్లు, కార్ వాష్ సెంటర్లు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఇందులో భాగంగా వందల మందిని అరెస్టు చేశారు. హంబర్‌సైడ్ ప్రాంతంలోని ఒక భారతీయ రెస్టారెంట్‌లో ఏడు మంది చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. మరో నలుగురిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

అలాగే, సౌత్ లండన్‌లోని ఒక భారతీయ గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. బ్రిటన్ ప్రభుత్వం తమ బోర్డర్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేస్తూ అక్రమ వలసదారులను గుర్తించి దేశం నుంచి పంపించివేయాలని ఉద్దేశిస్తోంది.

జనవరి నెలలోనే 828 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి, 609 మంది అక్రమంగా ఉద్యోగాల్లో ఉన్నారని గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా అక్రమ వలసలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రకటించారు.

“చట్ట వ్యతిరేక వలసలను పూర్తిగా నిలిపివేయాలని మా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. గతేడాది జులైలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కీర్ స్టార్మర్ సర్కారు సరిహద్దు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటివరకు 4,000 మందికి పైగా అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈసారి ప్రత్యేకంగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

వలసదారులు ఎక్కువగా పనిచేసే రంగాలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం తన చర్యలు ముమ్మరం చేయడంపై వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కొనసాగుతూనే ఉంటే, భారతీయ వ్యాపార సంస్థలు, రెస్టారెంట్ రంగం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, అక్రమ వలసదారుల సమస్య, సరిహద్దు భద్రత, శరణార్థుల హక్కులపై బ్రిటన్ పార్లమెంట్‌లో సోమవారం చర్చ జరిగింది. బ్రిటన్‌లో వలస విధానాలు మరింత కఠినతరం కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.