స్కూల్ లో చదివేటప్పుడు లెక్కల్లో కేవలం 51 మార్కులు వచ్చాయి. ఇంకో సబ్జెక్టులో అయితే ఏకంగా ఫెయిల్ అయ్యాడు. ఎనిమిదో తరగతి వరకు చదువులో అస్సలు రాణించని ఆ పిల్లాడు ఇప్పుడు ఏకంగా నింగిలోకి రాకెట్ పంపాడు. అతనే స్కైరూట్ ఏరోస్పేస్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన. విక్రమ్-1 ప్రయోగంతో భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్ ప్రయాణం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
శ్రీహరికోట నుంచి జూలై 18న నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరుకుంది. ప్రైవేట్ రంగంలో సొంతంగా డెవలప్ చేసిన రాకెట్ ను కక్ష్యలోకి పంపిన తొలి భారతీయ కంపెనీగా స్కైరూట్ రికార్డు సృష్టించింది. 2018లో నాగ భరత్ దాకాతో కలిసి పవన్ ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. ప్రభుత్వ సంస్థల ఆధిపత్యం ఉన్న స్పేస్ సెక్టార్ లో ఒక ప్రైవేట్ కంపెనీ ఇలాంటి భారీ విజయం సాధించడం మామూలు విషయం కాదు.
ఈ ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే పవన్ తన కో-ఫౌండర్స్ కి గానీ, ఇన్వెస్టర్లకు గానీ కాల్ చేయలేదు. ముందుగా తన తండ్రికి ఫోన్ చేశాడు. అటువైపు నుంచి ఒక్క మాట కూడా రాలేదు, ఆయన ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడు. మాటలు లేకపోయినా ఆ కన్నీళ్ల వెనుక ఉన్న అర్థం పవన్ కు స్పష్టంగా తెలిసింది. తనపై ప్రపంచం నమ్మకం పెట్టుకోక ముందే, తనను అపారంగా నమ్మిన తండ్రికి పవన్ ఇచ్చిన అసలైన గిఫ్ట్ ఇది.
తన సక్సెస్ గురించి పవన్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. చిన్నప్పుడు చదువులో వెనుకబడిన తాను ఐఐటీలో అడుగుపెడతానని కలలో కూడా ఊహించలేదన్నాడు. తనకు మ్యాథ్స్ లో 51 మార్కులు వచ్చినా, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా తన తండ్రి ఏనాడూ నమ్మకం కోల్పోలేదని గుర్తుచేసుకున్నాడు. ఆ నమ్మకమే తనను ఈ స్థాయికి చేర్చిందని మనస్ఫూర్తిగా చెప్పుకొచ్చాడు.
స్కూల్ లో వచ్చే మార్కులు మన భవిష్యత్తును డిసైడ్ చేయలేవు అనడానికి పవన్ స్టోరీనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. టాలెంట్ బయటపడటానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో మనల్ని నమ్మేవాళ్లు తోడుంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఈ ఘటన నిరూపించింది. రాకెట్ సక్సెస్ అయినప్పుడు కన్నీళ్లు ఆపుకున్న పవన్, తన తండ్రి గురించి చెప్పేటప్పుడు మాత్రం ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
