అంబానీ చేత చప్పట్లు కొట్టించిన కుర్రాడు…

ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 54 బంతుల్లో 135 పరుగులు చేసి, 13 సిక్సర్లు, 10 బౌండరీలు బాదాడు. తొలి అర్ధశతకాన్ని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్, ఆపై మరింత వేగాన్ని పెంచి మరో 50 పరుగులకు కేవలం 20 బంతులే తీసుకున్నాడు. అతని అద్భుత బ్యాటింగ్‌ను చూసి స్టేడియం ఉర్రూతలూగిపోయింది.

మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ఆస్వాదిస్తూ, అతడు అర్ధశతకాన్ని పూర్తిచేసిన క్షణంలో నిల్చుని చప్పట్లు కొట్టారు. అంబానీ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిషేక్ ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు సైతం అద్భుతమైన రిప్లైలు ఇస్తూ, అతని దూకుడు భారత్‌కు కొత్త మ్యాచ్ విన్నర్ ను అందించిందని ప్రశంసిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‌కు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఇంగ్లండ్ పూర్తిగా తేలిపోయింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

అభిషేక్ శర్మ ఇన్నింగ్స్, ముకేశ్ అంబానీ స్పందన కలిపి మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి. అభిమానులు ఇప్పుడు అభిషేక్ శర్మను భారత క్రికెట్ భవిష్యత్తుగా చూస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ యువ క్రికెటర్ ఏ రేంజ్ లో రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి.