ఇండియాలో కరోనా.. ఒక దిగ్భ్రాంతికర అంకె

కరోనా కేసులు, మరణాల లెక్కల్ని చాలా తేలిగ్గా తీసుకునే పరిస్థితికి వచ్చేశాం. ఒకప్పుడు ఎక్కడో వీధి చివర ఒక కరోనా కేసు ఉందంటేనే వణికిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఎదురింట్లో కరోనా పేషెంట్ ఉన్నా మామూలుగానే ఉంటున్నాం. మన ఇంట్లో వాళ్లకు కరోనా వస్తే తప్ప భయపడట్లేదు. బయట ఎలా పడితే అలా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాం. అన్ని పనులూ యధావిధిగా చేసుకుపోతున్నాం.

ఐతే జనాలు లైట్ తీసుకుని ఉండొచ్చు కానీ.. దేశంలో కరోనా విలయం మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇండియాలో కరోనా మహమ్మారి ఒక దిగ్భ్రాంతికర మైలురాయిని అందుకుంది. మన దేశంలో ఇప్పటిదాకా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య లక్షకు చేరుకుంది. శుక్రవారం లేట్ నైట్ ఈ లక్షవ కరోనా మరణం నమోదైంది ఇండియా.

ప్రపంచవ్యాప్తంగా లక్ష కరోనా మరణాల మార్కును అందుకున్న మూడో దేశం ఇండియా. అమెరికాలో ఈ మహమ్మారి వల్ల ఇప్పటిదాకా 2.08 లక్షల మంది చనిపోగా.. బ్రెజిల్‌లో కరోనా మరణాల సంఖ్య 1.45 లక్షలుగా ఉంది. శుక్రవారం కూడా ఇండియాలో వెయ్యి మందికి పైగానే చనిపోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 64 లక్షల దాకా ఉండగా.. శుక్రవారం 81 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి.

మొత్తం లక్ష మరణాల్లో మూడో వంతుకు పైగా, అంటే 37 వేల పైచిలుకు చనిపోయింది ఒక్క మహారాష్ట్రలోనే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా 7 లక్షల కేసులు నమోదవగా.. 5870 మంది దాకా మరణించారు. తెలంగాణలో కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉండగా.. మరణాల సంఖ్య 1,145. ఇండియాలో ఇప్పటిదాకా 53.5 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 9 లక్షల దాకా యాక్టివ్ కేసులున్నాయి. ఒక దశలో రోజువారీ కేసులు లక్ష మార్కుకు చేరువగా వెళ్లగా.. ఆ తర్వాత కొంచెం తగ్గి 80 వేలకు అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి.