ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో భారతదేశంలో మొత్తం 85 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వినియోగదారుల భద్రతను కాపాడే లక్ష్యంతో, అవాంఛనీయ కంటెంట్, విధాన ఉల్లంఘనలను నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ పేర్కొంది.
వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన సమీక్షలో వాట్సాప్ 85,84,000 ఖాతాలను మూసివేసింది. వీటిలో 16,58,000 ఖాతాలను వినియోగదారుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకముందే పర్యవేక్షణా వ్యవస్థ ఆధారంగా నిషేధించారు. ఈ కఠిన నిర్ణయాలు వాట్సాప్లో అసమర్థ వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా తీసుకున్నవని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.
భారతదేశంలో సుమారు 60 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్కి ఇటీవల అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. యూజర్ల ప్రైవసీ, భద్రతకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, మిగతా సంస్థలతో పోలిస్తే మరింత పారదర్శకంగా వ్యవహరించడానికి కట్టుబడి ఉన్నామని వాట్సాప్ తెలిపింది. దీనిలో భాగంగా, చర్యలకు సంబంధించిన సమాచారం త్వరలో విడుదల చేసే నివేదికల్లో పొందుపరుస్తామని వెల్లడించింది.
అభ్యంతరకర కంటెంట్ను నివారించేందుకు యూజర్లు తమకు నచ్చని ఖాతాలను బ్లాక్ చేయగల సౌకర్యాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక, ఇలాంటి విషయాలపై కంపెనీకి నేరుగా ఫిర్యాదు చేసే విధానం కూడా యాప్లో అమలు చేస్తోంది. వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా తమ నియమావళిని పకడ్బందీగా పాటించడంలో తాము నిర్లక్ష్యం చేయబోమని వాట్సాప్ స్పష్టం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates