చైనాలో మరో ఊహించని కష్టం

చైనా ఆధునికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా కూడా ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్త కష్టం అక్కడ తీరని నష్టాన్ని కలిగిస్తోంది. అగ్ర జనాభా కలిగిన చైనా ఇప్పటికే కొత్త రోగాలను పుట్టించడంలో చరిత్ర సృష్టించింది. ఇక కరోనా నుంచి ఆ దేశం ఇంకా కొలుకోలేదు. ప్రపంచానికి తెలియడం లేదు కానీ ఏదో ఒక వైరస్ తో అక్కడి జనాలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా నుంచి రహస్యాలు అయితే భయటపెడుతున్నాయి. 

ఇక ప్రస్తుతం చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జననాల రేటు గణనీయంగా తగ్గడంతో పాటు వృద్ధ జనాభా పెరగడం అనేక రంగాల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. జనాభా పెరగడంతో అక్కడి ప్రజలు సైతం పిల్లలను కనడం తగ్గించేశారు. ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్న యువత పెళ్లికి దురమవుతోంది. ఒకవేళ చేసుకున్నా కూడా పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. ఇక జననాల రేటు పడిపోవడంతో కొత్త తరాల సంఖ్య తగ్గిపోయి, దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూతపడుతున్నాయి. 

చైనా విద్యాశాఖ గణాంకాల ప్రకారం, గతేడాది 14,808 కిండర్ గార్టెన్ పాఠశాలలు మూసివేశారు.  2022తో పోలిస్తే విద్యార్థుల నమోదు రేటు 11 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. అదే విధంగా, 5,645 ప్రాథమిక పాఠశాలలు కూడా తక్కువ విద్యార్థుల సంఖ్య కారణంగా పనిచేయడం ఆపాయి. జనాభా పరంగా చైనా ప్రస్తుతం రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది. జననాల రేటు తగ్గడం, మరోవైపు వృద్ధుల సంఖ్య పెరగడం సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. వరుసగా రెండవ ఏడాది కూడా చైనా జనాభా తగ్గుతూ 140 కోట్లకు చేరింది. 

2023లో జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు తగ్గింది, గత ఏడాది 90 లక్షల మంది జననాలు మాత్రమే నమోదయ్యాయి. 1949 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లుగా ఉండగా, 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని అంచనా. పిల్లలు లేక మూతపడుతున్న పాఠశాలలను, కిండర్ గార్టెన్‌లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మార్చే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనాభా సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లేకుండా, చైనా భవిష్యత్తులో మరింత సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.