సన్‌రైజర్స్‌ 2025 రిటెన్షన్‌: క్లాసెన్‌ తో పాటు ఆ ముగ్గురు

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం మెగా వేలం ప్రారంభం కాకముందే, అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ చివరి నాటికి ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్‌ జాబితాను అందించాల్సి ఉంది. ముందుగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను రూ.18 కోట్లకు, అక్షర్ పటేల్‌ను రూ.14 కోట్లకు, స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ను రూ.11 కోట్లకు రిటైన్ చేయనున్నట్లు సమాచారం.

దిల్లీ జట్టు మొత్తం రిటెన్షన్‌ కోసం రూ.75 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమై ఉంది. ఈసారి ప్రతి ఫ్రాంచైజీకి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఉండే విధానం అవలంబించనున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా తన కీలక ఆటగాళ్లను మిస్ చేసుకోకుండా ముందడుగు వేసింది.

సన్‌రైజర్స్‌ జట్టు అత్యధిక ధరతో రిటైన్ చేసుకోబోయే ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ కావొచ్చని సమాచారం. పటిష్టమైన హిట్టర్‌గా పేరుపొందిన క్లాసెన్‌ను సన్‌రైజర్స్‌ రూ.23 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకునే అవకాశం ఉందని స్పోర్ట్స్‌ వెబ్‌సైట్లు తెలిపాయి. అలాగే, పాట్ కమిన్స్‌ను కూడా సన్‌రైజర్స్‌ జట్టు రూ.18 కోట్లకు రిటైన్ చేయనుంది.

కెప్టెన్‌గా సేవలు అందించిన కమిన్స్‌ గత సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక యువ ఆటగాడు అభిషేక్‌ శర్మ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టీమ్ కు సపోర్ట్ చేసాడు. అతడిని రూ.14 కోట్లకు రిటైన్ చేయనున్నారు. మరోవైపు, ట్రావిస్ హెడ్‌ మరియు ఆల్‌రౌండర్‌ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా సన్‌రైజర్స్‌ తమ జట్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.