రిలయన్స్ జియో బడ్జెట్ ఫోన్లు చూశారా..

రిలయన్స్ జియో తాజాగా రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ‘జియో భారత్ వి3’ మరియు ‘వీ4’ పేరిట వచ్చిన ఈ ఫోన్లు ఇప్పుడు సాధారణ మధ్యతరగతి జానాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రూ. 1,099 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫోన్లు 2జీ యూజర్లను 4జీకి మారే అవకాశాన్ని కల్పిస్తాయి. పాత మోడల్ అయిన ‘జియో భారత్ వి2’ విజయవంతమయ్యాక, జియో డిజిటల్ డివైస్‌లతో మరింత మంది వినియోగదారులకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త ఫోన్లు బడ్జెట్ ధరల్లోనే అధునాతన సౌకర్యాలు అందిస్తున్నాయి. డిజైన్ పరంగా యువతను ఆకట్టుకునేలా స్లీక్‌గా తీర్చిదిద్దారు. ‘జియో భారత్ వి3’ మరియు ‘వీ4’ ఫోన్లు స్టైల్, పెర్ఫార్మెన్స్ పరంగా మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి. వీటిలో ముందుగానే జియో డిజిటల్ సర్వీసులు ఇన్స్టాల్ చేసి ఉంటాయి, అందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి సదుపాయాలు ఉంటాయి. జియో టీవీ ద్వారా 455 లైవ్ టీవీ చానళ్లను వీక్షించవచ్చు.

ఇక, జియో పే ద్వారా డిజిటల్ పేమెంట్స్ కూడా సులభంగా చేసుకోవచ్చు. ఫోన్లలో 1000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు, 128 జీబీ వరకు స్టోరేజ్ విస్తరించుకునే అవకాశం ఉంది. వీటిలో 23 భారతీయ భాషలకు సపోర్ట్ ఉండడం విశేషం. వాయిస్ కాల్స్, డేటా వంటి సేవలను కలిపి కేవలం రూ. 123తో రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో నెలలో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 14 జీబీ డేటా కూడా లభిస్తుంది, ఇది ఇతర టెలికం కంపెనీలతో పోలిస్తే 40% ఎక్కువ ఆదా చేయనుంది. త్వరలో ఈ ఫోన్లు జియోమార్ట్, అమెజాన్‌తో పాటు అన్ని ప్రముఖ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.